కరోనా ఎఫెక్ట్: ముంబైకి విమానాలు బంద్, పెరగనున్న LED బల్బ్స్ ధర.. ఎంతంటే?
కరోనా వైరస్ ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆటో, ఫార్మా రంగాలకు ముడి సరుకులు, ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులు చైనా నుండి ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు రంగాలు సహా వివిధ రంగాలకు కరోనా భయాలు పట్టుకున్నాయి. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో తగిన చర్యలు ప్రకటిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం చెప్పారు. కరోనా ప్రభావం వివిధ రంగాలపై పడింది...

ఆపిల్ ఐఫోన్పై దెబ్బ
కరోనా ప్రభావం కారణంగా మార్చి క్వార్టర్లో తమ ఆదాయ అంచనాలను చేరుకోలేకపోవచ్చునని ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని చెబుతోంది. జనవరి - మార్చి క్వార్టర్లో 63 బిలియన్ డాలర్ల నుండి 67 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయాలు నమోదు కావొచ్చునని అంచనా వేస్తోంది.

సింగపూర్ ఎయిర్లైన్స్
పలు అంతర్జాతీయ నెట్వర్క్లో విమానాలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. రద్దు జాబితాలో ముంబై కూడా ఉంది. భారత ఆర్థిక రాజధానితో పాటు ఫ్రాంక్ఫర్ట్, జకర్తా, లండన్, లాస్ ఏంజెల్స్, ప్యారిస్, సియోల్, సిడ్నీ, టోక్యో తదితర నగరాలున్నాయి. కాగా, కరోనా వైరస్ను అంతమొందించేందుకు సింగపూర్ తమ ఆర్థిక ప్యాకేజీల్లో 4.6 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఇక్కడ డెబ్బైకి పైగా కేసులు నమోదయ్యాయి.

LED బల్బులు 10 శాతం పెరిగే ఛాన్స్
ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా తయారీదార్లు మార్చి నుండి ఎల్ఈడీ బల్బుల ధరలను పది శాతం పెంచవచ్చునని పరిశ్రమ సంఘం చెబుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా చైనా నుంచి భారత్కు ఎలక్ట్రానిక్ కంపోనెంట్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

పరిశ్రమ మూత
కరోనా భయాలతో చైనా ఎలక్ట్రానిక్ కంపోనెంట్ల తయారీ పరిశ్రమ మూతబడింది. దీంతో మార్కెట్ డిమాండ్ను తయారీదారులు అందుకోలేని పరిస్థితి వస్తోందని, ఈ క్రమంలో పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, ఇబ్బందుల దృష్ట్యా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ సంఘం ఎల్కోమా చెబుతోంది. మొబైల్, టెలివిజన్, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను, దేశీయ లైటింగ్ పరిశ్రమను కరోనా ప్రభావితం చేస్తోందని ఎల్కోమా ఉపాధ్యక్షులు సుమిత్ పద్మాకర్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications