ఐటీ కంపెనీలకు షాక్, ఉద్యోగుల వేతనాలు, బోనస్పై కరోనా దెబ్బ
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లోకి కూరుకుపోయాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. ఈ ప్రభావంతో అంతర్జాతీయంగా దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని ప్రభుత్వాలు కూడా ఆదేశిస్తున్నాయి. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మాత్రమే వెసులుబాటు కల్పించారు.
కొంపముంచుతున్న కరోనా, 2.5 కోట్ల ఉద్యోగాలు హుష్కాకి
వేతనాల పెంపు, బోనస్లు పక్కకు..
కరోనా ప్రభావం కంపెనీలపై కూడా తీవ్రంగానే ఉంది. ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే ఆప్షన్ ఇవ్వడంతో పాటు కరోనా ఉద్యోగులకు మరో రకంగా దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఉద్యోగులకు వేతనాలు పెంచే సమయం. కానీ ఐటీ కంపెనీలు వేతన పెంపు, బోనస్లను ప్రస్తుతానికి పక్కన పెట్టే పరిస్థితులు ఉన్నాయట.
పెంపు పక్కకు ఎందుకంటే..
దాదాపు గత మూడు నెలలుగా ఐటీ కంపెనీలు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం వచ్చే ఏడాది కూడా పడుతుందని చెబుతున్నారు. మన ఐటీ కంపెనీలకు చైనా, అమెరికా సహా వివిధ దేశాల్లోని కంపెనీలకు సేవలు అందిస్తున్నాయి. ఆ కంపెనీలు మూతబడటం.. ఇక్కడి ఐటీ కంపెనీలపై ప్రభావం పడింది. దీంతో ఆదాయం తగ్గుతోంది. ఆదాయం తగ్గడంతో పెంపు, బోనస్ అంశాన్ని పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతానికి పక్కన పెట్టేశాం..
ప్రస్తుతానికి బోనస్, వేరియేబుల్ పే లేదా ఇంక్రిమెంట్స్ను పక్కన పెట్టామని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం భద్రత గురించి ఆలోచిస్తోంది.
ప్రతి 10మందిలో ఎనిమిది మంది WFH
ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగుల్లో ప్రతి 10 మందిలో దాదాపు 8 మంది ఇంటి నుండి పని (WFH) చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప కార్యాలయానికి రావడంలేదు. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని, సామాజిక దూరం పాటించాలని కంపెనీలు కూడా ఉద్యోగులకు సూచనలు జారీ చేశాయి. ట్రైనీలను క్యాంపస్ నుండి ఇంటికి పంపించారు.
వృద్ధి రేటుకుదింపు
అమెరికా, యూరోప్ దేశాలకు మన ఐటీ కంపెనీలు ఎక్కువగా సేవలు అందిస్తాయి. అక్కడ కంపెనీలు మూతబడటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ఐటీ కంపెనీలపై మరింత ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో భారత లార్జ్, మిడ్ క్యాప్ టెక్ సేవల కంపెనీల వృద్ధి రేటును కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ 3-8 శాతం నుండి 2-4 శాతానికి తగ్గించింది.
యాక్సెంచర్..
అంతకుముందు 6-8 శాతం వృద్ధి రేటును అంచనా వేసిన యాక్సెంచర్ ఇప్పుడు 3-6 శాతానికి తగ్గించింది. కరోనా ప్రభావం ఐటీ ఆదాయాలపై తీవ్రంగా పడనుంది. ఈ ప్రభావం వేతనాల పెంపు, బోనస్లపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
టాటా కన్సల్టెన్సీ ఏం చెప్పిందంటే..
ప్రస్తుతం కోరనా వల్ల జరిగే నష్టంపై దృష్టి సారించామని, పే ఫ్రీజ్పై ఎలాంటి డిస్కషన్స్ జరగడం లేదని టీసీఎస్ చెబుతోంది. ఈ సంక్షోభం లాభాలపై పడుతుందని, కాబట్టి సంస్థ బోనస్ ఈ లాభదాయకతతో ముడివడి ఉంటే వాటిపై కూడా ప్రభావం ఉంటుందని ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు.
పదేళ్ల క్రితం సంక్షోభం..
కరోనా కారణంగా 2008-09 నాటి ఆర్థిక సంక్షోభం కళ్ల ముందు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించింది. ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9వేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.