కరోనా వైరస్ ఎఫెక్ట్: మూతబడిన కంపెనీలు, శాలరీలేని జీవితాలు, ఉద్యోగాల కోత
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా డ్రాగన్ కంట్రీలో వివిధ కంపెనీలు మూతబడ్డాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. చైనాలోని 11 రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో సెలవులను పొడిగించారు. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వాహనాల్లో మూడింట రెండు వంతులు ఈ రాష్ట్రాల్లోనే తయారవుతాయి.
కరోనా వైరస్ వల్ల చైనా దెబ్బతింటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం, ఎందుకంటే?
భారీగా పడిపోయిన వాహన ఉత్పత్తి
వూహాన్, దాని పరిసర ప్రాంతాల్లోని ఈ రాష్ట్రాల్లో వాహన పరిశ్రమలు ఈ నెల 10వ తేదీ వరకు పని చేయకపోతే తొలి త్రైమాసికంలో ఉత్పత్తి దాదాపు 3.5 లక్షల యూనిట్ల మేరకు తగ్గుతుందని అంచనా. ఒకవేళ ఈ పరిస్థితి వచ్చే నెల మధ్య వరకు కొనసాగి పొరుగు రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి ఆగిపోతే వాహన విడిభాగాల తయారీకి ప్రధాన కేంద్రమైన ఈ ప్రాంతం నుంచి సరఫరాలకు అంతరాయం ఏర్పడి చైనా వ్యాప్తంగా విడిభాగాల కొరత ఏర్పడి నష్టం మరింత ఎక్కువవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో వాహనాల ఉత్పత్తి తొలి త్రైమాసికంలో 32.3 శాతం తగ్గుతుందని అంచనా. కరోనా సంక్షోభానికి ముందు వేసిన అంచనా కంటే ఈ మేరకు తగ్గుతుందని భావిస్తున్నారు.
400 మందిని తొలగించిన ఎయిర్లైన్స్
కరోనా కారణంగా విమానయాన సంస్థలు కూడా కుదేలవుతున్నాయి. ఇప్పటికే ఇబ్బందులతో సతమతమవుతున్న తమ సంస్థకు కరోనా రూపంలో పిడుగు వచ్చి పడిందని హాంకాంగ్ ఎయిర్ లైన్స్ చెబుతోంది. ఈ సమస్యల కారణంగా 400 మంది సిబ్బందిని తొలగించినట్లు తెలిపింది. మిగిలిన సిబ్బందిని వేతనరహిత సెలవు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొంది. హాంకాంగ్లోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో హాంకాంగ్ ఎయిర్ లైన్స్ రెండోది.
ఉద్యోగులను పంపిస్తున్న క్యాథే పసిఫిక్
క్యాథే పసిఫిక్ కూడా తమ సంస్థలోని మొత్తం 27 వేలమంది సిబ్బందిని బలవంతంగా ఇంటికి సాగనంపుతోంది. కరోనా కారణంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తడంతో ప్రయాణీకుల సంఖ్య పడిపోయింది. దీంతో మార్చి - జూన్ మధ్యలో వేతనరహిత సెలవులు తీసుకోవాల్సిందిగా కోరినట్లు క్యాథే పసిఫిక్ తెలిపింది.
హ్యుండాయ్ ప్లాంట్ మూసివేత
ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకత కలిగిన తమ వెహికల్ కాంప్లెక్స్ను హ్యుండాయ్ శుక్రవారం మూసివేసింది. కరోనా కారణంగా చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా క్షీణించి వాహన విడిభాగాల కొరత ఏర్పడటంతో క్లోజ్ చేసింది. వుల్సన్లోని ఈ భారీ కాంప్లెక్స్కు ప్రతి సంవత్సరం 14 లక్షల వాహనాలు తయారు చేసే సామర్థ్యం ఉంది. హ్యుండాయ్ మూసివేత కారణంగా వేలమంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. దాదాపు 25 వేలమంది కార్మికుల్ని బలవంతంగా సెలవులపై పంపించింది.
సుజుకీ ప్రకటన
విడిభాగాల సరఫరాకు అంతరాయం కలగడంతో భారత్లోని తమ వాహనాల ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, ఈ నేపథ్యంలో చైనా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి విడిభాగాలను తెప్పించుకోవడంపై పరిశీలన జరుపుతున్నామని జపాన్ ఆటోమొబైల్ సంస్థ సుజుకీ ప్రకటించింది.
మేమూ మూసివేస్తున్నాం..
చైనాలోని తమ అన్ని ప్లాంట్లను ఈ నెల 16వ తేదీ వరకు క్లోజ్ చేస్తున్నట్లు టయోటా ప్రకటించింది. చైనాలో వాహన సరఫరాకు సంబంధించిన ప్లాంట్లు, సరఫరాదారులు త్వరగా విధుల్లో చేరకుంటే యూరప్లోని తమ ప్లాంట్స్ను రెండు వారాల్లో మూసివేస్తామని ఫియట్ క్రిస్లర్ తెలిపింది.