కరోనా వైరస్: మన ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బే!
చైనాలో పుట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిన 'కరోనా వైరస్' అక్కడితో ఆగకుండా ఇతర దేశాలకూ పాకి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకూ పెను సవాల్ విసురుతోంది. కరోనా వైరస్ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతోంది.
ఇప్పటికే ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశీయ వాహన రంగం కొంతకాలంగా నిస్తేజంగా ఉంది. సగటు భారతీయుడి కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది.
భారత్ ఎకానమీపై తీవ్ర ప్రభావం...
మన దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం.. ఇప్పటికే నెమ్మదించిన మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఆయా రంగాల్లో ఉత్పత్తి తగ్గిపోయి, ఎగుమతులు మందగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్తో చైనా అతలాకుతలం అవుతోంది. అక్కడ పలు రంగాల్లో ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా రవాణా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మన దేశం చాలా ఉత్పత్తుల విషయంలో చైనాపైనే ఆధారపడి ఉంది.
చైనా చతికిలపడితే.. మనం ‘ఢమాల్'...
మన దేశం దిగుమతి చేసుకుని టాప్ 20 ఉత్పత్తుల్లో అధిక భాగం చైనా నుంచే వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగం విషయానికొస్తే.. 45 శాతం ఉత్పత్తులు చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఆర్గానిక్ కెమికల్స్ కూడా 60 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ఇక ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగించే ముడి వస్తువులు 70 శాతం చైనా నుంచి దిగుమతి అవాల్సిందే. అలాగే వాహన రంగంలోనూ 25 శాతానికిపైగా మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు కరోనా ప్రభావంతో చైనా గనుక చతికిలపడితే.. మన పని ‘ఢమాల్' అవడం ఖాయం.
రెండు నెలల్లో రూ.25 లక్షల కోట్లు...
కరోనా వైరస్ మొత్తం ప్రపంచానికే పెను శాపంగా పరిణమించింది. దీని కారణంగా గ్లోబల్ ఎకానమీ జీడీపీ 0.1 శాతం నుంచి 0.4 శాతం వరకు తగ్గవచ్చని ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంచనా వేసింది. ఇక ఆర్థిక పరమైన నష్టాల విలువ అయితే రూ.50 వేల కోట్ల నుంచి రూ.25 లక్ష్ల కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు 156 బిలియన్ల నష్టం వాటిల్లిందని, ఇది గ్లోబల్ జీడీపీలో 0.2 శాతానికి సమానమని ఏడీబీ తెలిపింది. కరోనా కారణంగా ఒక్క చైనాకే 103 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ఈ నష్టం విలువ ఆ దేశ జీడీపీలో 0.8 శాతానికి సమానం. మిగతా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లిన నష్టం విలువ 22 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనాను అడ్డుకునేందుకు ఏడీబీ ఏసియా దేశాలకు 40 లక్షల డాలర్ల సాయం ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం ఏడాది ఏసియా పసిఫిక్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 21,100 కోట్ల డాలర్లు నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. చైనా గ్రోత్రేటుపై 3 శాతం వరకు ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. జపాన్, ఆస్ట్రేలియా, హాంగ్కాంగ్ దేశాలూ భారీగా నష్టపోతాయని అంచనా.
టూరిజం ట్రాష్, బీమా ఉంటే బాగు...
కరోనా కేసులు పెరిగే కొద్దీ టూరిజం, ట్రావెల్ వ్యాపారాలు బాగా దెబ్బతింటున్నాయి. ఇండియా టూరిజం సెక్టార్ నష్టం 84.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.623 కోట్లు) వరకు ఉండొచ్చని ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) తెలిపింది. పరిస్థితులు మరింత విషమిస్తే నష్టం 252 మిలియన్ డాలర్ల వరకు చేరవచ్చని చెబుతోంది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా వాటిల్లే నష్టాలకు ఇన్సూరెన్స్ కవరేజిని అందించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరింది. ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పనిసరిగా ఈ తరహా కవరేజిని అందించే విధంగా రెగ్యులేటరీ సంస్థ ఐఆర్డీఏఐ చర్యలు తీసుకోవాలని, ఈ దిశగా అవసరమైన ఆదేశాలను ఆర్థిక శాఖ.. ఐఆర్డీఏఐకి పంపించాలని సీతారామన్కు రాసిన లేఖలో సీఏఐటీ పేర్కొంది. ఇన్సూరెన్స్ కంపెనీలు దోమలు లేదా ఇతర జీవుల కారణంగా వ్యాప్తి చెందే వ్యాధులకూ కవరేజి అందించే పాలసీలను తీసుకురావాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ కోరారు. ఈ విషయాన్నే వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
నష్టాల బారిన దేశీయ స్టాక్ మార్కెట్లు...
కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. గత వారం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఈ వారం కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.18 గంటల సమయానికి సెన్సెక్స్ 1,520.53 పాయింట్లు నష్టపోయి 32582.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ 440.60 పాయింట్లు నష్టపోయి 9514.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ దశలో 2,000 పాయింట్లు పడిపోయినా ఆ తర్వాత 1500 పాయింట్ల వద్ద కనిపించింది. 190 షేర్లు లాభాల్లో, 730 షేర్లు నష్టాల్లో ఉండగా, 62 షేర్లలో ఎలాంటి మార్పులేదు. గత వారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గత సోమవారం 3000 పాయింట్లు, గురువారం కూడా అంతే మొత్తంలో నష్టపోయిన సెన్సెక్స్ శుక్రవారం కూడా 3000 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కానీ సాయంత్రానికి కాస్త కోలుకుని లాభాల్లో ముగిసింది. వారాంతంలో లాభాల్లో ముగిసినప్పటికీ.. మొత్తంగా స్టాక్ మార్కెట్లు గత వారం మాత్రం భారీగా నష్టపోయాయి.
ఫార్మా రంగం కుదేలు...
చైనాలో కరోనా వైరస్ విజృంభించినప్పుడు మన దేశంలోని షిప్పింగ్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్ తదితర రంగాలన్నీ కుదేలయ్యాయి. కారణం వాటికి అవసరమయ్యే ముడిసరుకులు, దిగుమతులు చైనా నుంచి తగ్గిపోవడమే. దీంతో మన ఫార్మా రంగంలో ఉత్పత్తి, సరఫరాలకు సంబంధించి తీవ్ర కొరత ఏర్పడింది. మన దేశంలో మందుల తయారీలో ఉపయోగంచే ముడిసరుకులు అంటే ఏపీఐలు, బల్క్ డ్రగ్స్ చాలావరకు చైనా నుంచే దిగుమతి అవుతాయి. ఈ దిగుమతులు తగ్గడమే కాకుండా.. ఇండియాలోనూ కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు కొన్ని డ్రగ్స్ ఎగుమతులపైనా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఫార్మా రంగాన్ని దెబ్బతీస్తాయని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎగుమతుల నిషేధంతో, కాంట్రాక్ట్లు రద్దు అవుతాయని, ఫలితంగా తీవ్ర నష్టాలు తప్పవని, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో న్యాయపరమైన వివాదాలు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి.
మండిపోతున్న హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్ల ధరలు...
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో వైరస్ తమకెక్కడ సోకుతుందో అనే ముందుజాగ్రత్తతో పలువురు ముక్కుకు తగిలించుకునే మాస్క్లు, చేతులు శుభ్రపరుచుకునే శానిటైజర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాటికి గిరాకీ బాగా పెరిగిపోయి, వాటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అంతకుముందు రూ.150కే లభించే మాస్క్ ధర కొన్ని మెడికల్ షాపుల్లో రూ.300కు పెరిగిపోయింది. పోనీ డబ్బు పోతే పోయింది, మాస్క్ అయినా దొరుకుతుందా? అంటే అదీ లేదు. ఇక హ్యాండ్ శానిటైజర్ల విషయానికొస్తే.. డెటాల్, హిమాలయ వంటి బ్రాండ్ల శానిటైజర్లకు మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడింది. దుకాణదారులు వీటిని రూ.200 నుంచి రూ.600 మధ్యలో విక్రయిస్తున్నారు.