కరోనాపై పోరుకు ఏపీకి రిలయన్స్ భారీ విరాళం, థ్యాంక్స్ చెప్పిన జగన్
అమరావతి: కరోనా మహమ్మారిపై పోరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న పోరాటానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం భారీ సాయం అందించింది. కరోనా నివారణ చర్యల కోసం రూ.5 కోట్లు ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందించింది. భారీ విరాళం ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రశంసించారు. ఈ మేరకు లేఖ రాశారు. కరోనా నివారణ చర్యలకు ఇది ఉపయోగపడుతుందని చెబుతూ, ధన్యవాదాలు తెలిపారు.
కరోనాపై పోరుకు తెలంగాణకు ముఖేష్ అంబానీ రూ.5 కోట్ల విరాళం
కోవిడ్ 19కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడంతో పాటు పీఎం కేర్స్ ఫండ్స్కు రిలయన్స్ రూ.530 కోట్లకు పైగా అందించింది. కరోనా మహమ్మారి సవాళ్లపై పోరాడేందుకు రిలయన్స్ తరఫున, ఆహారం, సరఫరా చేస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ఒక ముఖ్యమైన ప్రయత్నంలో ముందున్నాయని ప్రతినిధులు తెలిపారు. దేశంలో మొదటి 100 పడకల ప్రత్యేకమైన కోవిడ్ 19 హాస్పిటల్ నిర్మాణంతో పాటు అనేక కార్యక్రమాల్ని చేపడుతోంది రిలయన్స్. కోవిడ్ 19 రోగులను నిర్వహించడానికి కేవలం రెండు వారాల్లోనే హాస్పిటల్ను సిద్ధం చేసింది రిలయన్స్. దేశవ్యాప్తంగా ఉచిత భోజనం కూడా అందిస్తోంది.
ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకుల కోసం రోజుకు లక్ష మాస్కులు ఉత్పత్తి చేయడం, ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకుల కోసం రోజూ వేలాది పిపిఇలను తయారు చేయడంతో పాటు ఎమర్జెన్సీ వాహనాలకు దేశవ్యాప్తంగా ఉచిత ఇంధనంతో అందిస్తోంది రిలయన్స్. రిలయన్స్ రిటైల్ ప్రతిరోజూ మిలియన్ల మంది భారతీయులకు దుకాణాలు, హోమ్ డెలివరీ ద్వారా అవసరమైన సామాగ్రిని అందిస్తోంది.