ఉద్యోగాలు, వేతనాలు భద్రమా, కొత్త జాబ్స్ ఎలా.. ఇదీ ఎక్స్పర్ట్స్ మాట: అసలు కథ ముందుంది!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోందని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక అవసరాలు 2.5ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని ఐఎంఎప్, ఐక్య రాజ్య సమితి వంటి సంస్థలు అంచనా వేశాయి. ఇది రాబోయే రెండు నెలల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగితేనే. ఈ వైరస్ వేలాదిమంది ప్రాణాలు తీసుకుంది. అలాగే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. OECD ఎనకమిక్ ఔట్ లుక్ డేటా ప్రకారం 2020లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 1½ శాతం పడిపోవచ్చు.
ఉద్యోగాలపై ప్రభావం ఎలా ఉంటుందో
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ, భారత ఆర్థిక పురోభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ సహా వివిధ దేశాలు లాక్డౌన్ ఆప్షన్ ఎంచుకుంటున్నాయి. కరోనా కారణంగా హఠాత్తుగా ఆర్థిక వృద్ధి ఆగిపోవడం ఆందోళన, భయాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు పోతాయా లేదా మళ్లీ సాధారణ స్థితికి వస్తుందా అనే ఆందోళన చాలామందిలో ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానత్వంతో వ్యవహరించాలని వివిధ సంస్థలు, ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. వేతనాలు తగ్గించవద్దని, అలాగే నిలిపివేయవద్దని కోరుతున్నారు. కానీ పరిస్థితులు వాస్తవానికి భిన్నంగా ఉండవచ్చునని అంచనా. కరోనా ప్రభావిత టాప్ 15 దేశాల్లో భారత్ ఉండటంతో పాటు 348 మిలియన్ డాలర్ల ప్రభావం పడుతుందని ఇటీవలి ఐక్య రాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. ఇప్పటికే ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడింది.
అసలు కథ ముందుంది.. లాక్ డౌన్ ప్రభావం పెద్దదే
ఇప్పటికే గోఎయిర్, ఇండిగో వంటి సంస్థలు వేతనాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఆటో, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో సప్లై చైన్ తెగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఈసారి వేతనాల పెంపు చాలా తక్కువగా లేదా అసలే ఉండకపోవచ్చునని చెబుతున్నారు. లాక్ డౌన్ ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని, ముందు ముందు భారీగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రానున్న నెలల్లో ఇది కనిపిస్తుందంటున్నారు.
ఉద్యోగాలు పోతాయా, కొత్త ఉద్యోగాల మాటేమిటి?
ఐపీఈ గ్లోబల్ అక్నాలెడ్జెస్ ఎండీ అశ్వజిత్ సింగ్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం కన్సల్టెన్సీ కంపెనీలపై కూడా పడిందని చెప్పారు. దాదాపు తమ క్లయింట్ కంపెనీలు అన్నీ కూడా స్ట్రాటెజిక్, ఆన్గోయింగ్ ప్రాజెక్టులను నిలిపివేశాయని, ఇవి మా చెల్లింపులపై ప్రభావం చూపిందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయే అవకాశాలు లేవని, అలాగే వేతనాలు ఆలస్యం కావని, వేతన తగ్గింపు కూడా ఉండదని చెప్పారు. అయితే వేతన పెంపు, బోనస్ అంశాలపై మదింపు జరుగుతోందన్నారు. ప్రస్తుతానికి హైరింగ్స్ నిలిపివేసినప్పటికీ, ఇదివరకు తీసుకున్న వారిని మాత్రం ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నారు. అయితే చేరిక కాస్త ఆలస్యం కావొచ్చన్నారు.
ఈ సెక్టార్లో ఉద్యోగాలపై ప్రభావం
ఏదేమైనా ఫార్మల్ సెక్టార్ వారి సమస్యలను ప్రభుత్వానికి వినిపించాలని, ప్రోత్సాహకాలు, బెయిలవుట్స్ అడగాలని పేర్కొన్నారు. అయితే అసంఘటిత రంగంలో ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చునని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రూ.1.70 లక్షల భారీ ప్యాకేజీ సామాన్యులకు, ప్రత్యేకంగా పేదరికంలోని వారి కోసమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష బదలీ, ఆహార భద్రత కోసం ఇచ్చారన్నారు.
ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు..
అయితే ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు, నగదు ప్రవాహాన్ని మెరుగు పరిచేందుకు, ఉద్యోగాలను కాపాడేందుకు మిడ్ టర్మ్ నుండి లాంగ్ టర్మ్ చర్యలు అవసరమని అశ్వజిత్ అన్నారు. ఇప్పటికే వలస కార్మికులు, తాత్కాలిక లేబర్ పైన ప్రభావం పడిందన్నారు.
ఉద్యోగాలు రక్షించే చర్యలు
ఉద్యోగాలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రకటించాల్సి ఉందన్నారు. ప్రయివేటు రంగం ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వ్యాపారాలు మనుగడ సాగించేలా చూడాలన్నారు. ప్రకటించే ఆర్థిక సంస్కరణలు మధ్యస్థ నుండి దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఉండాలన్నారు. జీతాలు చెల్లించేందుకు మద్దతుగా ప్రయివేటు రంగం చేతిలోకి నగదు ప్రవాహం అవసరమన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
ప్రయివేటు రంగం మెరుగైన నగదు ప్రవాహం కలిగి ఉండేందుకు, వేతనాలు ఇచ్చేందుకు, అమ్మకందారులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావమే చూపనుందని, కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమన్నారు.