కంపెనీలకు గుడ్ న్యూస్... గ్రూప్ ఇన్సూరెన్సు పాలసీ గా దానికి గుర్తింపు!
దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీలకు శుభవార్త. తమ ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం పరితపిస్తున్న వాటికి ఇన్సూరెన్స్ రేగులటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డి ఐఏ) ఊరట కల్పించింది. కరోనా చికిత్స కోసం ఇటీవలే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చిన కరోనా కవచ్ అనే పాలసీ ని ఇకపై కంపెనీలకు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రొడెక్టు గా ఇచ్చేందుకు అనుమతించింది. ఈ మేరకు అన్ని జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఉత్తర్వుట్లు జారీ చేసింది.
దీంతో చిన్న కంపెనీల నుంచి భారీ స్థాయి కంపెనీల వరకు అందరికీ ఉపశమనం లభించనుంది. ఎందుకంటే ఇప్పుడు కరోనా చికిత్స తీసుకోవాలంటే రూ లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు ఆర్థిక భారం అవుతోంది. పైగా చాలా ఆస్పత్రులు స్పష్టమైన ఆదేశాలు లేకపోవటంతో చికిత్స కు కేవలం నగదును మాత్రమే అనుమతిస్తున్నాయి. ఐతే ఇకపై సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు నిక్షేపంగా కరోనా కవచ్ పాలసీ ని గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ గా విక్రయించవచ్చు.
భారత్ సహా ఆ దేశాల దెబ్బతో టిక్టాక్ ఉక్కిరిబిక్కిరి, దిక్కుతోచక కీలక నిర్ణయం!
ఇప్పటి వరకు...
ఇటీవలే మార్కెట్లోకి కరోనా కవచ్, కరోనా రక్షక్ పేర్లతో మార్కెట్లో కేవలం కరోనా చికిత్స కోసమే ఉద్దేశించిన పాలసీ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే అవి ఇప్పటి వరకు కేవలం ఇండివిడ్యుల్స్, ఫామిలీస్ (వ్యక్తులు, కుటుంబాలు) మాత్రమే ఇచ్చేందుకు అనుమతి ఉంది. అవి కూడా 105 రోజులు, 195 రోజులు, 285 రోజుల కాల పరిమితి తో జారీ చేస్తున్నారు. గరిష్టంగా రూ 5 లక్షల కవరేజ్ లభిస్తుంది. ఒక రోజు వయసున్న పిల్లల నుంచి 65 ఏళ్ళు ఉన్న పెద్ద వారికీ ఈ పాలసీ ఇవ్వవచ్చు. క్యాష్ లెస్ పద్ధతిలో కూడా ఈ పాలసీ పనిచేస్తుంది కాబట్టి, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పాలసీ జులై లోనే అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇకపై దీనిని గ్రూప్ పాలసీ గా కూడా జారీ చేస్తారు.
డాక్టర్ల కు 5% డిస్కౌంట్...
కరోనా కవచ్ పాలసీ ని విక్రయించేందుకు బీమా కంపెనీలకు అనుమతి లభించేలా జులై 21 న ఐఆర్డీఐఏ ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ గా ఇచ్చేందుకు కవచ్ పాలసీ లో 'గ్రూప్' అనే పదాన్ని కొత్తగా చేర్చాల్సి ఉంటుంది. ప్రీమియం మినహా ఇతర అన్ని నిబంధనలు సాధారణ స్టాండర్డ్ పాలసీ కి వర్తించేవే దేనికి కూడా వర్తిస్తాయి. ఒక కంపెనీలో అందరూ మెడికల్ సిబ్బంది, డాక్టర్లు మాత్రమే ఉన్నప్పుడు వారికి ఇచ్చే గ్రూప్ పాలసీ ప్రీమియం లో 5% డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా వైరస్ తో పోరాటంలో వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ నిబంధన విధించారు.
చిన్న కంపెనీలకు పెద్ద ఊరట...
రెండు నెలల కఠిన లాక్ డౌన్ అనంతరం... జూన్ నుంచి అన్ని కంపెనీలు, సంస్థలు పనిచేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అన్ని కార్యాలయాలు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, శానిటైజషన్ చేస్తూ, మాస్కులు ధరిస్తూ పనిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో దేశం మొత్తం మీద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చిన్న కంపెనీలకు కొత్త కష్టాలు వచ్చాయి. వారి ఉద్యోగులకు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లు ఉండవు. అలాగని కంపెనీయే స్వతహాగా వారికి ఆయా పాలసీ లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుత ఈ సంక్షోభం లో కరోనా కవచ్ వంటి పాలసీ లు గ్రూప్ పాలసీ లు గా లభిస్తే వారికి పెద్ద ఊరటేనని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న కంపెనీల ఉద్యోగులు కరోనా భయంతో విధులకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సంస్థను నడిపేందుకు యజమానులు నానా ఇబ్బందులు పడుతున్నారు.