కరోనా ఎఫెక్ట్ ... గీజర్ లకు , వాటర్ డిస్పెన్సర్ లకు భలే గిరాకీ
కరోనా వైరస్ ప్రభావంతో భారతదేశంలో పరిశ్రమలు కుదేలయ్యాయి . చాలా పరిశ్రమలు ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా లాక్డౌన్ ప్రభావంతో ,కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిశ్రమలు మూత పడిన విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కూడా చాలా పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించాయి. మానవ వనరులను తగ్గించాయి. కరోనాతో వచ్చి పడిన ఆర్ధిక సంక్షోభంతో ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గుతుందని చాలా పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించాయి. అయితే ఇదే సమయంలో గీజర్లు, వాటర్ డిస్పెన్సర్ ల డిమాండ్ విపరీతంగా పెరిగింది.
చైనాపై ఆధారపడే ఇండియన్ టెలికాం సంస్థల మనుగడ .. లేదంటే కష్టమే !!
గీజర్ లు, వాటర్ డిస్పెన్సర్స్ లకు డిమాండ్ .. ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగం
గీజర్ లు, వాటర్ డిస్పెన్సర్స్ లు తయారు చేస్తున్న పరిశ్రమలు ప్రజల డిమాండ్ కు తగినట్లుగా ఉత్పత్తి చేయకపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో గీజర్లు వాటర్ డిస్పెన్సర్ లకు షార్టేజ్ నెలకొంది.కరోనా సమయంలో ఆరోగ్య విషయంలో ప్రజలలో చాలా అవగాహన పెరిగిన కారణంగా ఆరోగ్య రక్షణకు దేశ ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. కరోనా నుండి కాపాడుకోవడం కోసం వేడి నీటిని తాగాలని సూచిస్తున్న నేపథ్యంలో, వేడి నీళ్లను కాగబెట్టుకొని తాగడం ఇబ్బందిగా భావిస్తున్న వారు లేకపోలేదు .
కరోనాకు చెక్ పెట్టేందుకే గీజర్ లు , వాటర్ డిస్పెన్సర్లు
వేడినీళ్ళు తాగితే కరోనా రాదనీ , ఒకవేళ లక్షణాలు లేకుండా వచ్చిన తగ్గుతుందని భావిస్తున్న వారంతా వేడి నీటిని తాగడం కోసం వాటర్ డిస్పెన్సర్ ల కొనుగోలుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లో వాటర్ డిస్పెన్సర్లు అవసరానికి తగ్గట్టుగా లభించటంలేదు. ప్రస్తుతం మార్కెట్లో వాటి కొరత ఏర్పడింది. కరోనా కారణంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి అని చెప్తున్నారు. దీనికోసం వేడి నీటితో శుభ్రం చేసుకుంటే కరోనా దరిదాపులకు కూడా రాదు అన్న భావన పెరిగిన ప్రజలు గీజర్ లను కొనుగోలు చేస్తున్నారు.
మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా మొగ్గు .. జోరుగా గీజర్లకు , వాటర్ డిస్పెన్సర్ లకు గిరాకీ
ముఖ్యంగా మధ్యతరగతి ప్రజకే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. చాలామందిలో గీజర్ లను, వాటర్ డిస్పెన్సర్ ను తప్పనిసరిగా వాడాలి అన్న భావన కలగడంతో వాటి కోసం పరుగులు పెడుతున్నారు. అయితే పరిశ్రమలు మాత్రం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్లుగా ఉత్పత్తిని చేయడం లేదన్న భావన వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కరోనా సమయంలో వేడి నీళ్ల కోసం గీజర్ లకు, వాటర్ డిస్పెన్సర్ లకు భలే గిరాకీ పెరిగింది.