మాల్స్కు గుడ్బై: గళ్లీలోని కిరాణా దుకాణమే ముద్దు, ఆ బ్రాండ్స్నే కొంటాం
కరోనా మహమ్మారి దెబ్బకు వినియోగదారుల వైఖరిలో చాలా మార్పులు వస్తున్నాయి. కొన్నేళ్లుగా దగ్గరలోని కిరాణా దుకాణాల కంటే మాల్స్కు వెళ్లడానికి మొగ్గు చూపే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. కానీ కరోనా-లాక్ డౌన్ చాలామందిలో మార్పు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఎక్కువమంది మాల్స్ కంటే దగ్గరలోని కిరాణా దుకాణానికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు డెలాయిట్ సర్వేలో వెల్లడైంది. డెలాయిట్ గ్లోబల్ స్టేట్ ఆఫ్ ది కన్స్యూమర్ ట్రాకర్ పేరుతో ఈ సర్వే నిర్వహించింది. ఈ-మెయిల్ ద్వారా నిర్వహించిన సర్వేలో 18 ఏళ్లు నిండిన వెయ్యి మందికి పైగా స్పందించారు.
ప్రతి గూగుల్ ఉద్యోగికి అదనంగా రూ.75,000, ఎందుకంటే: సుందర్ పిచాయ్ ప్రకటన
వివిధ దేశాల్లో సర్వే
కుటుంబం, స్నేహితులతో కలిసి మాల్, ఏసీ సూపర్ మార్కెట్లకు వెళ్లడం, అక్కడ అవసరం ఉన్నవి లేనివీ కొనుగోలు చేయడం తెలిసిందే. ఇప్పుడు కరోనా కస్టమర్ల తీరులో మార్పు తీసుకు వచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లి సరుకులు కొనుగోలు చేయడం కంటే ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణాల్లో కొనుగోలు చేయడం మంచిదని ఎక్కువమదంి వినియోగదారులు డెలాయిట్ సర్వేలో అభిప్రాయపడ్డారు. కేవలం మన దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్ సహా 13 దేశాల్లోను డెలాయిట్ సర్వే చేసింది. ఏప్రిల్ 19 నుండి మే 16 మధ్య ఈ సర్వే నిర్వహించింది.
72 శాతం మంది స్థానిక దుకాణాలకే
నూటికి 72 మంది స్థానిక వస్తువుల కోసం ఇంటికి దగ్గరలోని కిరాణా దుకాణాలే మేలు అని చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ దుకాణాలే ఐటమ్స్ అందించాయని, ఇక నుండి అక్కడే కొంటామని తెలిపారు. ఇదివరకు ఎడాపెడా ఏది పడితే అది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు మారిన ఆర్థిక పరిస్థితులతో అలా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. కిరణా వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో 55 శాతం మంది ఆహార వస్తువుల మీద, 52 శాతం మంది ఇతర నిత్యావసరాల మీద ఆసక్తి చూపారు.
ఆ బ్రాండ్స్ కొనుగోలు చేస్తాం
చాలామంది వినియోగదారులు ఇళ్లలో సరుకులు నిల్వ ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. దగ్గరలోని కిరాణా దుకాణాల నుండి అప్పటికి అప్పుడు తెచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఆరు వారాల్లో ఖర్చు విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని సగం మందికి పైగా వినియోగదారులు చెప్పారు. సంక్షోభం సమయంలో బాగా స్పందించిన బ్రాండ్స్ను కొనుగోలు చేస్తామని 64 శాతం మంది తెలిపారు. అంటే కరోనా సమయంలో కొన్ని సంస్థలు భారీ మొత్తంలో సహాయం ప్రకటించాయి. ఆ ఉత్పత్తుల వైపు ఎక్కువమంది మొగ్గు చూపారు.
సొంత వాహనం కొనుగోలుకు 79 శాతం మంది మొగ్గు
ప్రయాణం కోసం ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకోరాదని నిర్ణయించుకున్నట్లు ఎక్కువమంది వెల్లడించారు. క్యాబ్స్, ఇతర అద్దె వాహనాల వినియోగానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు 70% మంది తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సొంత వాహనం కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు 79 శాతం మంది చెప్పారు.