కరోనా వైరస్ దెబ్బ: జీతాలు కట్... బోనస్ నిలిపివేత!
కరోనా కష్టాలు ఇన్నిన్ని కావయా! ఎక్కడో చైనా లో మొదలైన మాయదారి వైరస్ దెబ్బకు ప్రపంచమంతా తల్లడిల్లిపోతోంది. ఎవరో చేసిన నేరానికి మరెవరికో శిక్ష పడుతున్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే ఇదే మాటను బాహాటంగానే అనేశారు. కరోనా వైరస్ ఒక ప్రాణాంతక వైరస్ మాత్రమే కాక... ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసే చీడపురుగుగా కనిపిస్తోంది. ఎందుకంటే .. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని 170 దేశాలు చిరుగుటకులా వణికిపోతున్నాయి. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.
ప్రస్తుతం ప్రపంచం అంతా లాక్ డౌన్ అయిపోయింది. దీంతో అన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బ తింటున్నాయి. అసలే రెండేళ్లుగా అమెరికా - చైనా ట్రేడ్ వార్ తో దెబ్బతిన్న ప్రపంచానికి ... ప్రస్తుతం కరోనా రూపంలో మరో పెద్ద దెబ్బ తగిలింది. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఇందులో నుంచి బయట పడేందుకు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
కరోనా 'బోనస్': ఈ కంపెనీ ఉద్యోగులకు బోనస్, 1,000 డాలర్లు ప్రకటించిన ఫేస్బుక్
కోతలు మొదలు...
సాధారణంగా ఇండియా లో జనవరి నుంచి మార్చి వరకు అప్రైజల్ టైం. అంటే అన్ని రకాల కంపెనీలు తమ ఉద్యోగుల వార్షిక పనితీరును అంచనా వేసి వారికి వచ్చే ఏడాదికోసం వేతనాల పెంపు, అలాగే బోనస్ ల చెల్లింపు చేపడుతుంటారు. మార్చి లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఏప్రిల్ నెల నుంచి సవరించన వేతనాలు చెల్లిస్తారు. అలాగే బోనస్ ను ఏక కాలంలో చెల్లిస్తారు. కానీ, ఇప్పుడు కరోనా దెబ్బతో వేతనాల పెరుగుదల అటుంచి... కోతలు మొదలవుతున్నాయి. బోనస్ ల చెల్లింపును కూడా కంపెనీలు రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ ఐటీ కంపెనీలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఒక రంగంలో మొదలైన పద్ధతిని మరో రంగం వేగంగా అందిపుచ్చుకోవటం సహజమైన ప్రక్రియే.
టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ల పై నజర్...
ఇదిలా ఉండగా.. వేతనాల కోతలు, బోనస్ ల చెల్లింపులు అన్ని స్థాయిల ఉద్యోగులకు వర్తిస్తుండగా... టాప్ లెవెల్ ఉద్యోగులపై కరోనా ప్రభావం మరింత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ సీనియర్ మానేజ్మెంట్ ఉద్యోగుల వేతనాల్లో 50% కోత విధించనున్నట్లు తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ వేతనాల కోత తాత్కాలికం మాత్రమేనని తెలుస్తోంది. మళ్ళీ పరిస్థితులు చక్కబడితే వేతనాలను సవరించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియర్ మానేజ్మెంట్ వేతనాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి... వాటిని కట్టడి చేస్తే చాలా వరకు కంపెనీల వేతనాల బిల్లులు అదుపులో ఉంటాయని కంపెనీల ఆలోచనగా ఉన్నట్లు వినికిడి.
చివరగా ఉద్యోగాల కోత..
ఇప్పటికే ఒక్కో రంగానికి విస్తరించుకుంటూ వెళ్తున్న కరోనా వైరస్ దెబ్బ... మరో రెండు నెలల్లో సమిసి పోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంత పెద్ద మహమ్మారి అయినా 3-4 నెలల కాలంలో తగ్గుముఖం పడుతుందని, కరోనా కూడా ఇందుకు మినహాయింపు కాదని వారు చెబుతున్నారు. గతంలో వచ్చిన అనేక వైరస్ లు కూడా ఇలాగే నశించిపోయినట్లు వారు పేర్కొంటున్నారు. చైనా లో గతేడాది డిసెంబర్ లో ప్రారంభం అయిన కరోనా వైరస్... ప్రస్తుతం తగ్గుముఖం పడుతోందని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు ఇండియా లో కూడా అదే జరుగుతోందని అంటున్నారు. వచ్చే నెలలో మన దగ్గర కూడా పూర్తిగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలా జరగకపోతే మాత్రం ఉద్యోగుల తొలగింపు కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.