Work From Home: 2023లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్.. హైబ్రిడ్ మోడల్ కొనసాగించనున్న కంపెనీలు..
Work From Home: అరె పరిస్థితులన్నీ పూర్తిగా సర్థుకున్నాయ్.. పాత పద్ధతిని తిరిగి క్రమంగా తీసుకొచ్చే పనిలో ఉన్నాయి కంపెనీలు. ఇందుకోసం ఉద్యోగులను సిద్ధం చేయాలనే ప్రయత్నంలో భాగంగా హైబ్రిడ్ విధానాన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత మెల్లగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని ప్లాన్ చేశాయి. కానీ ఇప్పుడప్పుడే ఇది కుదిరేలా లేదని తెలుస్తోంది.
మళ్లీ కరోనా కేసులు..
కరోనా వైరస్ పుట్టిల్లైన చైనాలో కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రకం వేరియంట్ లక్షల మందిని ఆసుపత్రుల పాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీల్లోనే కాక ఉద్యోగుల్లోనూ భయాలు మెుదలయ్యాయి. దీనిలో భాగాంగా కంపెనీలు 2023లోనూ హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు.
కంపెనీలు ఏమంటున్నాయి..
ఫ్లిప్కార్ట్, మారికో, టాటా స్టీల్, ఎల్టీఐ మైండ్ ట్రీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో పాటు మరిన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఇదే బాటను ఎంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగులకు మంది అవకాశం లభించవచ్చు. పైగా హైబ్రిడ్ మోడల్ వర్క్ అనేది కంపెనీలు, ఉద్యోగుల మధ్య ప్రాధాన్యత ఎంపికగా మారుతోంది. పైగా ఇటు ఉద్యోగాన్ని, అటు కుటుంబాన్ని ఏకకాలంలో బ్యాలెన్స్ చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ దోహదపడుతుందని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.
హైబ్రిడ్ మోడల్..
చాలా ఐటీ సేవల కంపెనీలు తమ ప్రాజెక్టులకు అనుగుణంగా ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి రోస్టర్ తయారు చేయాలని మేనేజర్లకు సైతం సమాచారం ఇచ్చాయి. దీనివల్ల ఆఫీసుల్లో ఉద్యోగులు ఒకరిని ఒకరు కలవటం మంచి రిలేషన్ షిప్ పెరగటానికి దోహదపడుతోందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇది వారి ప్రొడక్టివిటీని కూడా పెంచటానికి సహాయకారిగా నిలుస్తుందని వారు అంటున్నారు.
ఫ్లిప్కార్ట్ ప్లాన్..
కంపెనీ గత కొన్ని నెలలుగా హైబ్రిడ్ మోడల్ను అమలు చేస్తోందని ఫ్లిప్కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ వెల్లడించారు. ఇదే సమయంలో LTIMind Tree ప్రస్తుతం 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు రప్పిస్తున్నప్పటికీ.. ఉద్యోగుల డిమాండ్, అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించవచ్చని కంపెనీ తెలిపింది.