కోవిడ్-19: వినడానికి బాగుంది.. అమలు చేయలేం! ఈపీఎఫ్ సడలింపులకు కంపెనీలు నో
కరోనా వైరస్ దెబ్బకు ఇండియా మొత్తం సుమారు రెండు నెలలు లాక్ డౌన్ లో గడిపింది. దీంతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు లాక్ డౌన్ మొదలైన దగ్గర నుంచి అనేక ప్యాకేజీ లు, సడలింపులు ప్రకటించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు జాతినుద్దేశించి ప్రకటన చేస్తూ ఏకంగా రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఇక అయన ప్రకటనను అమల్లోకి తీసుకొచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రోజుకో ప్రకటన చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆమె చెబుతున్నప్పుడు ఆహా అనుకున్న వారే అంతా. కానీ తీరా పూర్వాపరాలు పరిశీలించి చూసి అవాక్కయ్యారు. పేరుకే రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ కానీ.. అందులో సరిగ్గా రూ 2-3 లక్షల కోట్ల ప్రయోజనం (ప్రత్యక్షంగా) లేదని అందరికీ అర్థమైంది. ఇక ప్రభుత్వం ఏమీ చేయదు కానీ ఎవరి బతుకు వారే బతకాలన్న స్పష్టత వచ్చేసింది. దీంతో ప్రభుత్వ సడలింఫులపై అందరికీ నమ్మకం సన్నగిల్లింది. ఇందులో ప్రధానమైనది ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్). కొన్ని కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల భవిష్య నిధి కి సంబంధించిన విధి విధానాలు కూడా ఏ మాత్రం ప్రయోజనకరంగా లేకపోవటం గమనార్హం.
COVID 19: వచ్చే ఏడాదికి ఇండియా పరుగు, ఎందుకంటే: దువ్వూరి
10% నికి తగ్గింపు...
లాక్ డౌన్, ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా అందరి చేతిలో నగదు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులు కావాలంటే వారి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ను 10% నికి తగ్గించుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. అలాగే కంపెనీ చెల్లించాల్సిన తప్పనిసరి మొత్తం కూడా 10% నికి పరిమితం చేసుకోవచ్చని, తద్వారా అందుబాటులోకి వచ్చే మొత్తాన్ని ఉద్యోగికి బదలాయించాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి కనీస వేతనం నుంచి 12% ఈపీఎఫ్ కు జమ చేస్తుండగా... కంపెనీ కూడా సరిగ్గా 12% మొత్తాన్ని దానికి జమ చేయాల్సి ఉంటోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో ప్రతి ఉద్యోగికి 4% మేరకు అదనపు వేతనం లభించాల్సి ఉంది(ఉద్యోగి నుంచి 2% మిగులు, కంపెనీ నుంచి 2% మిగులు). కానీ వాస్తవం వేరేలా ఉంటోంది.
పన్ను పోటు ...
దేశంలో సుమారు 6 కోట్ల మంది ఆక్టివ్ ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వీరందరికీ భారీ ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెప్పింది. ప్రతి ఒక్క ఉద్యోగి జేబులోకి అదనపు సొమ్ము అందుబాటులోకి వస్తుంది కాబట్టి, దానిని వారు లాక్ డౌన్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు వినియోగించుకోవచ్చు అని సాక్షాత్తు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. కానీ, వాస్తవం మరోలా ఉంది. ఈపీఎఫ్ సడలింపు మిగిలిన 4% మొత్తం పన్ను పరిధిలోకి వెళ్ళిపోతోంది. దీంతో ఆయా ఉద్యోగి పన్ను రేట్ల ప్రకారం కనిష్టంగా 2% గరిష్టంగా 3% పన్నుల చెల్లింపునకే పోతోంది. ఇక మిగిలేది కేవలం 1% మాత్రమే. అంటే ప్రభుత్వం ఒక చేత ఇచ్చినట్లే ఇస్తూ... మరో చేత పన్ను కోత పెట్టి మన సొమ్ము కాజేస్తోందన్నమాట. అందుకే, చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ విషయాన్ని వివరించి పాత విధానమే బెటర్ అని చెబుతున్నాయి. అదే విధానాన్ని అమలు చేస్తున్నాయి కూడా.
గతంలోనూ అంతే...
లాక్ డౌన్ ప్రకటించిన తొలినాళ్లలో కూడా మన ఆర్థిక మంత్రి నిర్మల ఈపీఎఫ్ పై సరిగ్గా ఇలాంటిదే ఒక ప్రకటన చేశారు. చిన్న కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా ఉద్యోగికి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12%, అలాగే కంపెనీ చెల్లించాల్సిన 12%... మొత్తం 24% ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. అయితే దీనికి ఒక మెలిక పెట్టింది. ఆయా సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 100 లోపు ఉండి, అందులో 90% ఉద్యోగుల వేతనాలు రూ 15,000 లోపు ఉంటేనే ఇది వర్తిస్తుందని ప్రస్ఫుటం చేశారు. దీంతో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ను ఎన్ని కంపెనీలు సాధించాయో ఎవరికీ అర్థం కాని అంశంగా మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు ఎలా ఉన్నాయంటే... మేం అన్నీ చేస్తున్నాం. అన్నీ ఇస్తున్నాం. మీరే తీసుకోవట్లేదు. అది మీ ఖర్మ అన్నట్లు ఉంటోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ తో కనీసం 20 లక్షల మందికైనా ప్రయోజనం జరగకపోతే అది ఏ రకంగా ప్రజాహితంగా ఉన్నట్లో ఏలిన వారే చెప్పాలని వారు ఆక్షేపిస్తున్నారు.