ఆర్థిక వ్యవస్థకు అవే కీలకం, వాహన పరిశ్రమకు రూ.6,000 కోట్ల భారీ నష్టం
కరోనా కారణంగా కమర్షియల్ వెహికిల్ మ్యానుఫ్యాక్చరర్స్ దెబ్బతిన్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల తయారీ కంపెనీలకు రూ.6వేల కోట్లవరకు నష్టం రావొచ్చునని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. వాణిజ్య వాహనాల(CV) అమ్మకాలు గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా కారణంగా.. అంటే రెండేళ్ల కాలంలో భారీస్థాయిలో క్షీణించడమే ఇందుకు కారణంగా పేర్కొంది. కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్-జూన్ క్వార్టర్లో వాణిజ్య వాహనాల అమ్మకాలు 85 శాతం మేర పడిపోయి 31,636కు పరిమితమయ్యాయి.
వరల్డ్ ఫ్యాక్టరీ.. చైనా శకం ముగిసినట్లేనా? భారత్కు సూపర్ ఛాన్స్!
పదేళ్ల కనిష్టానికి
సగటున 30 శాతం క్షీణతను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థికసంవత్సరంలో కమర్షియల్ వెహికిల్ మ్యానుఫ్యాక్చరర్స్కు వచ్చే నష్టం రూ.6,000 కోట్లుగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. లాజిస్టిక్స్కు కమర్షియల్ వెహికిల్స్ అత్యంత కీలకం. కాబట్టి పారిశ్రామిక కార్యకలాపాలు, వస్తు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈ రంగం కోలుకోవచ్చునని పేర్కొంది. వరుసగా రెండేళ్ల పాటు (మందగమనం, కరోనా) సేల్స్ పడిపోవడంతో పదేళ్ల కనిష్టానికి చేరుకున్నట్లు పేర్కొంది. విక్రయాలు తగ్గితే కంపెనీల లాభదాయకత తగ్గుతుందని తెలిపింది.
పదేళ్ల క్రితం..
చివరిసారి 2009-10 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ వెహికిల్ సేల్స్ మన దేశంలో 5,33,000 యూనిట్లుగా నమోదయ్యాయి. కమర్షియల్ వెహికిల్స్ ఆర్థిక వ్యవస్థ కీలకమైన లాజిస్టిక్ లింక్. వీటి విక్రయాలు నెమ్మదిగా కోలుకుంటే.. ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదిగా కోలుకున్నట్లుగా భావించవచ్చు. ఇవి ఎంత త్వరగా కోలుకుంటే అంత వేగంగా వృద్ధి ఉంటుందని చెబుతున్నారు.
గత ఏడాది 29 శాతం డౌన్
మార్చి 2020తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో సేల్స్ 29 శాతం పడిపోయాయని, ఇప్పుడు కరోనా వల్ల అంతకుమించి నష్టం జరుగుతోందని, దీని వల్ల కమర్షియల్ వెహికిల్ మేకర్స్ భారీగా నష్టపోవాల్సి ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. ఇప్పటికే మొదటి క్వార్టర్లో 85 శాతం సేల్స్ పడిపోయాయి. అంతా బాగుంటే వచ్చే ఏడాది నాటికి సేల్స్ బాగుంటాయని, 2020 ఆర్థిక సంవత్సరానికి చేరుకోవచ్చునని తెలిపింది. దేశంలో రవాణాకు అత్యంత ప్రధానం కమర్షియల్ వెహికిల్స్ కావడం వల్ల వాటి అమ్మకాల వృద్ధిలో మందగమనం కంపెనీలను తీవ్రంగా కుంగదీస్తోంది.