బెంచ్ టైమ్ కట్: కాగ్నిజెంట్ అనూహ్య నిర్ణయం.. టెన్షన్లో టెక్కీలు!
పేరుకు సాఫ్ట్వేర్ అయినా.. లక్షల్లో వేతనాలు లభిస్తున్నా.. టెక్కీల గుండెల్లో గుబులు మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం.. ఐటీ కంపెనీలు అనూహ్యంగా ఉద్యోగుల కోతకు దిగుతుండడమే. రాబోయే నెలల్లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఊపందుకోనుంది.
తాజాగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ప్రాజెక్టులు లేని ఉద్యోగుల బెంచ్ టైమ్ గరిష్ట పరిమితిని తగ్గించింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బిల్లింగ్ ప్రాజెక్టులపై లేని ఉద్యోగుల బెంచ్ టైమ్ను కాగ్నిజెంట్ 60 రోజుల నుంచి 35 రోజులకు తగ్గించింది. ఇక ఆ 35 రోజుల తర్వాత.. బెంచ్పై ఉన్న ఉద్యోగులను కంపెనీ బయటికి సాగనంపుతుందన్నమాట. ఈ ప్రక్రియ కూడా రెండు నుంచి మూడు నెలల లోపే పూర్తవుతుంది.
గతంలో ఇలా బిల్లింగ్ లేని ప్రాజెక్ట్లుల్లో బెంచ్పై ఉన్న ఉద్యోగులకు తమ బిజినెస్ యూనిట్లలో లేదా ఇతర ప్రాజెక్టుల్లో అవకాశం పొందేందుకు కాగ్నిజెంట్ అధిక గ్రేస్ టైమ్ను కల్పించేది. అలాంటి సందర్భాలలో ఇతర నగరాలకు వెళ్లేందుకు ఇష్టపడని ఉద్యోగులు, ఇతర డొమైన్లను ఎంచుకోని ఉద్యోగులను మాత్రమే కంపెనీ పింక్ స్లిప్ ఇచ్చి బయటికి పంపించేది.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బిల్లింగ్ లేని ప్రాజెక్టుల్లో బెంచ్పై ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు ఎక్కువగా అవకాశం ఇవ్వడం లేదు. ఉద్యోగులు సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకునేలా వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా ఒత్తిడి పెంచేందుకే కాగ్నిజెంట్ ఇప్పుడు ఈ నూతన బెంచ్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఇన్నాళ్లూ ఏళ్ల తరబడి రెండంకెల వృద్ధిని నమోదు చేసిన సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ వృద్ధి రేటు కూడా ఇటీవల పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటోంది. తిరిగి మెరుగైన వృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. మారుతున్న క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకునే కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే వారిపై మరింత ఒత్తిడి పెంచేందుకే తాజాగా బిల్లింగ్ ప్రాజెక్టులపై లేని ఉద్యోగుల బెంచ్ టైమ్ను 35 రోజులకు కుదించినట్లు నిపుణులు భావిస్తున్నారు.