వారన్ బఫెట్ను దాటేసిన ఆసియా కొత్త కుబేరుడు: ముఖేష్ అంబానీ కిందకు...
బీజింగ్: ఇటీవలే ఆసియా అత్యంత ధనికుడిగా ఎదిగిన చైనాకు చెందిన జోంగ్ షంషాన్ అంతలోనే ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో చేరిపోయారు. గత నెలలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటిన జోంగ్ షంషాన్ తాజాగా వారన్ బఫెట్ను కూడా దాటిపోయారు. తద్వారా ప్రపంచ 6వ ధనికుడిగా నిలిచారు. 2021 ఏడాది నాటికి షంషాన్ ఆదాయం 13.5 బిలియన్ డాలర్లు పెరిగి 91.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో 86.2 బిలియన్ డాలర్లు కలిగిన బఫెట్ను వెనక్కి నెట్టారు.
జోబిడెన్కు చిక్కులు, అలీపే సహా 8 చైనీస్ పేమెంట్ యాప్స్కు ట్రంప్ షాక్
ఆరో స్థానంలోకి జోంగ్ షంషాన్
జోంగ్ షంషాన్ ఆదాయం 2021లో ఈ స్వల్పకాలంలో 13.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ ఆదాయం 6.7 బిలియన్ డాలర్ల కంటే దాదాపు రెండింతలు.
టాప్ 5లో జెఫ్ బెజోస్ ($188.2 బిలియన్లు), ఎలాన్ మస్క్ ($176.4 బిలియన్లు), బిల్ గేట్స్ ($131.2 బిలియన్లు), బెర్నార్డ్ అర్నాల్ట్($112.6 బిలియన్లు), మార్క్ జుకర్బర్గ్ ($102.7బిలియన్లు)గా ఉన్నాయి. ఇప్పుడు ఆరో స్థానంలోకి జోంగ్ షంషాన్ వచ్చారు.
జోంగ్ షంషాన్ షేర్లు ఇలా జంప్
నోంగ్ఫూ స్పిరంగ్, బీజింగ్ వాంతాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజ్ చైర్మన్ ఈ జోంగ్ షంషాన్. 2020 సంవత్సరంలో ఈ రెండు కంపెనీలను ఐపీవోకు తీసుకు వచ్చారు. గత సంవత్సరం నోంగ్ఫూ స్పిరంగ్ ఐపీవో ప్రైస్ ద్వారా 200 శాతం ఎగిశాయి. అలాగే ఈ ఏడాది 18 శాతం పెరిగాయి. ఇక, బీజింగ్ వాంతాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజ్ లిస్టింగ్ నుండి 25 శాతం ఎగిసింది. ఏడాది ప్రాతిపదికన 26 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
ముఖేష్ కిందకు..
2020 ఏడాదిలో ఆసియా కుబేరుడిగా ముఖేష్ అంబానీ నిలిచారు. అయితే చివరలో ఆ స్థానాన్ని జోంగ్ షంషాన్ కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 76 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఓ సమయంలో ముఖేష్ అంబానీ ప్రపంచ 4వ కుబేరుడిగా నిలిచారు. అయితే గత రెండు నెలలుగా రిలయన్స్ షేర్లు పతనమవుతున్నాయి. ఈ కాలంలో ఆల్ టైమ్ గరిష్టం నుండి దాదాపు 20 శాతం క్షీణించాయి. 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ చేరుకున్న తొలి భారత కంపెనీ రిలయన్స్.