దీపావళి సేల్: పండుగ సీజన్లో చైనాకు రూ.40,000 కోట్ల భారీ నష్టం!
భారత్కు చైనా నుండి పెద్ద ఎత్తున ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. అయితే ఇటీవల చైనా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, ఆత్మనిర్భర్ భారత్ నేపథ్యంలో చైనా నుండి వివిధ ఉత్పత్తులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రతి దీపావళి పండుగ సమయంలో భారత్కు భారీగా ఎగుమతులు చేసే చైనా కంపెనీలకు ఈసారి గట్టి షాక్ తగలనుందట. ఈ దీపావళి సీజన్లో రూ.40వేల కోట్ల వ్యాపార నష్టాన్ని చూడవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చైనా వస్తువులను నిషేధిస్తూ వ్యాపారుల సంఘం నిర్ణయం తీసుకుంది.
టీసీఎస్, ఇన్ఫీ, హెచ్సీఎల్, మైండ్ ట్రీ... ఐటీ ఉద్యోగులకు ముందే పండుగ వచ్చింది!
ప్రతి ఏటా దిగుమతులే ఎక్కువ
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సీజన్లో రూ.70,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని, ఇందులో రూ.40,000 కోట్ల ఉత్పత్తులు చైనా నుండి దిగుమతి అయ్యేవని ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) జాతీయ అధ్యక్షుడు బీసీ భార్తీయా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. కానీ గాల్వాన్ ఘటన అనంతరం ఇప్పుడు చాలామంది చైనా వస్తువులకు దూరంగా ఉంటున్నారని, మన సైనికులు ప్రాణత్యాగం చేశారని, దీనిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
ఆన్లైన్ సేల్స్ జంప్
మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్ సీర్ తాజా నివేదిక ప్రకారం ఈ సీజన్లో ఆన్లైన్ సేల్స్ దాదాపు 70 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ సేల్ సందర్భంగా 28 మిలియన్ ఆన్లైన్ షాపర్స్ ఉండగా ఈసారి 45-50 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. గ్రాస్ మర్చంటైజ్ వ్యాల్యూ 50 శాతం పెరిగి 2.7 బిలియన్ డాలర్ల నుండి 4 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా.
స్టాక్తో వ్యాపారులు రెడీ
పండగ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు స్టాక్ను పెంచుకున్నారని తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, కాస్మొటిక్స్, పూజా సామాగ్రి, టపాసులు, బొమ్మలు, గృహోపకరణాలు, గడియారాలు, రెడీమేడ్ వస్త్రాలు, పాదరక్షలు, సౌందర్య సాధనాలు, ఫర్నీచర్, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, స్టేషనరీ వంటి వాటికి డిమాండ్ ఉంటుందన్నారు.