కరోనా వైరస్ ఎఫెక్ట్: చైనాలోని టాటా మోటార్స్ JLR ప్లాంట్ మూసివేత!
చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్లు దెబ్బతిన్నాయి. కరోనా కారణంగా చైనాలో జీడీపీ రేటు ఒక శాతం వరకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా టాటా మోటార్స్కు చెందిన జేఎల్ఆర్ ప్లాంట్ తాత్కాలికంగా మూతబడనుంది. టాటా మోటర్స్ కంపెనీ అనుబంధ సంస్థ చెరి జాగ్వార్ లాండ్ రోవర్ ప్లాంట్ చైనాలోని షాంఘై నగర సరిహద్దుల్లో ఉంది.
ఇది కరోనా వైరస్ పుట్టిన వూహాన్ నగరానికి కేవలం 800 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ చెరి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ఏడాదికి రెండు లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే JLR వాహనాలు చైనాలోని మొత్తం వాహన అమ్మకాల్లో అయిదో వంతు వరకు ఉంటుంది. చైనాకు ఎగుమతయ్యే మొత్తం వాహనాల్లో 75% బయటి దేశాల నుంచి ఎగుమతి కాగా మిగతా 25% ఈ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్నాయి. గత డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ వాహన ఉత్పత్తులు 21 శాతం వృద్ధిని సాధించాయి.
అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా టాటా మోటర్స్ ప్లాంట్ సెలవు రోజులను పొడిగించింది. మూడువేల మంది సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి మరింత కాలం కొనసాగితే JLR ఉత్పత్తులు భారీగా తగ్గుపట్టి కంపెనీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.