వరల్డ్ ఫ్యాక్టరీ.. చైనా శకం ముగిసినట్లేనా? భారత్కు సూపర్ ఛాన్స్!
మొబైల్ ఫోన్ మొదలు దాదాపు ప్రతి వస్తువు భారత్ సహా వివిధ దేశాలకు చైనా నుండి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం ప్రపంచ కర్మాగారంగా చైనా వర్ధిల్లుతోంది. అయితే ప్రపంచ ఫ్యాక్టరీగా వెలుగొందిన చైనా శకం ముగిసిందని అంటున్నారు నిపుణులు. ప్రముఖ ఐఫోన్ మేకర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి అనంతరం చాలా కంపెనీలు చైనాను వదిలి కంబోడియా, మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్లాండ్ దేశాలకు తరలి వెళ్తున్నాయి. తాజాగా భారత్కు 24 మొబైల్ మేకర్స్ వచ్చేందుకు సిద్ధమయ్యాయి.
షిఫ్టింగ్ టు ఇండియా... చైనాకు భారీ షాక్! భారత్లో మొబైల్ ఫోన్ల తయారీకి 24 కంపెనీలు
చైనాలో తగ్గిన ఉత్పత్తి
కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమలు తరలివెళ్లడం, అమెరికాతో ట్రేడ్ వార్ వంటి వివిధ అంశాల కారణంగా ప్రపంచ కర్మాగారంగా ఉన్న చైనా శకం ముగిసిందని చెబుతున్నారు. గాడ్జెట్స్ ఐఫోన్ నుండి డెల్ డెస్క్ టాప్స్, నింటెండో స్విచ్ల దాకా చైనా ఉత్పత్తి స్థావరంగా నిలిచింది. ఐఫోన్ నుండి స్విచ్ల వరకు ఎన్నో వస్తువులు తయారు చేసే హోన్ హోయ్ ప్రిసిషన్ ఇండస్ట్రీ కంపెనీ చైర్మన్ యంగ్ లియు మాట్లాడుతూ... చైనాలో ఉత్పత్తి తగ్గిందని, చైనా బయట ఉత్పత్తి 25 శాతం నుండి 30 శాతానికి పెరిగినట్లు తెలిపారు.
అమెరికా కూడా ఓ కారణం..
చైనాలో ఉత్పత్తి అయ్యే వస్తువులపై అగ్రరాజ్యం అమెరికా అధిక దిగుమతి సుంకాలు విధిస్తోందని, దీనిని నిరోధించేందుకు ఇతర ఆసియా దేశాల్లో తయారీని పెంచుతున్నట్లు ఫాక్స్కాన్ తెలిపింది. అది ఇండియా కావొచ్చు, ఇతర సౌత్ఈస్ట్ ఏసియా కావొచ్చు లేదా అమెరికా కావొచ్చు... అక్కడ మాత్రం ఉత్పత్తికి మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. చైనా కేంద్రీకృత ఎలక్ట్రానిక్ సప్లై చైన్ క్రమంగా విచ్చిన్నమవుతోందని చెబుతున్నారు. ప్రపంచానికి పరిశ్రమంగా చైనా రోజులు ముగిసినట్లేనని ఫాక్స్ కాన్ బాస్ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం కరోనా, ట్రేడ్ వార్ను చెబుతున్నారు.
చైనా బయటకు...
యాపిల్ ఐఫోన్ల నుంచి డెల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ వరకు అన్నింటికీ తయారీ కేంద్రం చైనా. యాపిల్కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్ కాన్తో పాటు చైనా కేంద్రంగా విస్తరించిన పదుల సంఖ్యలోని టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్ కు, అమెరికా మార్కెట్కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకుంటున్నాయి.
భారత్ ప్రత్యామ్నాయం..!
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కంపెనీలు తమ తయారీ కేంద్రాల్ని చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తుల్ని పూర్తిగా చైనా బయట తయారు చేసేందుకు సిద్ధమని యంగ్ లీ గత ఏడాది తెలిపారు. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని తేలిపోయింది. ఫాక్స్కాన్కు మన ఇండియాలో తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవల తెలిపింది. భారత్లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తోంది. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి ఫాక్స్కాన్ భారత్ను పరిశీలిస్తోంది. మొబైల్ దిగ్గజాలతో పాటు వివిధ రంగాల కంపెనీలు భారత్ను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నాయి.