క్రిప్టోకరెన్సీపై డ్రాగన్ కఠిన ఆంక్షలు, చైనా డిజిటల్ యువాన్ వస్తోంది
చైనా తన సొంత డిజిటల్ కరెన్సీ యువాన్ను త్వరలో తీసుకు వస్తోందా? అందుకే క్రిప్టోకరెన్సీపై కఠిన ఆంక్షలు విధిస్తోందా? అంటే అవుననే అంటున్నారు క్రిప్టో మార్కెట్ నిపుణులు. చైనా తన సొంత డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో క్రిప్టో కరెన్సీ చెల్లింపులు, సేవలను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పూర్తిగా నిషేధించిందని చెబుతున్నారు. డాలర్కు పోటీగా యువాన్ను ప్రపంచస్థాయి కరెన్సీగా చేయాలని చైనా భావిస్తోంది. దీంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్ కుదేలయింది. బిట్ కాయిన్ మైనింగ్ సెంటర్స్ క్లోజ్ అయ్యాయి. చైనా ఇటీవల క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇది డిజిటల్ యువాన్కు దారి అంటున్నారు. వర్చువల్ కరెన్సీలకు ఎలాంటి చట్టబద్దత లేదని గత శుక్రవారం పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రకటించింది. వీటిని మానిటరీ అథారిటీ జారీ చేయదని తెలిపింది. క్రిప్టోకు చట్టబద్దత లేదని, వీటి పంపిణీ, వినియోగం చేయడం చట్ట విరుద్ధమని వెల్లడించింది. అసాంఘిక ఆర్థిక కార్యకలాపాలను నిరోధిస్తామని తెలిపింది. ఈ ప్రకటనపై పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, సైబర్ అడ్మిన్స్ట్రేషన్ ఆఫ్ చైనా, సుప్రీం పీపుల్స్ కోర్టు సంతకాలు చేశాయి. చైనా నిర్ణయం నేపథ్యంలో బిట్ కాయిన్ తొమ్మిది శాతం మేర నష్టపోయింది.
క్రిప్టో కరెన్సీ బ్యాన్
గతంలో చైనా వాట్సాప్, గూగుల్ వంటి వాటిని బ్యాన్ చేసింది. వీచాట్ను, బైడును డెవలప్ చేసింది. ఆ తర్వాత వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ను బ్యాన్ చేసింది. గతవారం క్రిప్టోను నిషేధించడంతో బిటడ్ కాయిన్ తొమ్మిది శాతం క్షీణించి 41,085 డాలర్లకు ఎథేరియం పది శాతం పడిపోయి 2800 డాలర్లకు పడిపోయింది. క్రిప్టో కరెన్సీని 2013 నుండి బ్యాన్ చేస్తోంది. సెప్టెంబర్ 2017లో ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్ను బ్యాన్ చేసింది చైనా. ఇప్పుడు మరోసారి క్రిప్టోను బ్యాన్ చేసింది.
జూన్ నుండి పావులు
చైనా కేంద్ర బ్యాంకు విడుదల చేయనున్న డిజిటల్ కరెన్సీ తప్ప మిగిలిన వాటిని నిషేధించేందుకు జూన్ నుండి పావులు కదుపుతోంది చైనా. ఆ నెలలో ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా, అలీపే సంస్థల్ని క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్లను నిలిపివేయాలని పేర్కొంది. ఒకప్పుడు ప్రపంచంలో వినియోగించే క్రిప్టో కరెన్సీలో 80 శాతం చైనాలోనే మైనింగ్ జరిగేది. దీంతో సిచువాన్ ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాలో పలు కంపెనీలు మైనింగ్ ప్రాజెక్టుల్ని క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశాయి. ప్రపంచంలోనే క్రిప్టో కరెన్సీల తయారీ రెండో స్థానంలో ఉన్న పూలిన్ చైనాను వీడాలని నిర్ణయించింది. ఈ సంస్థ హెడ్ ఆఫీస్ హాంకాంగ్లో ఉంది.
సొంత డిజిటల్ కరెన్సీ..
చైనా సొంతంగా డిజిటల్ కరెన్సీని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పోటీ క్రిప్టోలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అందుకే వాటిని దేశం నుండి బయటకు పంపించాలని నిర్ణయించింది. 2014లో దీనిపై పని చేయడం ప్రారంభించింది. 2016లో డిజిటల్ కరెన్సీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసింది. 2020 నుండి ప్రయోగాత్మక వినియోగం మొదలు పెట్టింది. దీనిని ఈసీఎన్వైగా వ్యవహరిస్తోంది. అంటే ఎలక్ట్రానిక్ చైనీస్ యువాన్ అని అర్థం. కొద్ది నెలల క్రితం సొంతగా ఎలక్ట్రానిక్ కరెన్సీ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. బీజింగ్, చెంగ్డూ, షెన్జెన్ వంటి నగరాల్లో పరీక్షించింది. 2022 నాటికి డిజిటల్ యువాన్ను విడుదల చేసి, వింటర్ ఒలింపిక్స్లో పరీక్షించాలని భావిస్తోంది.