వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి 35.8 శాతం వాటా, ఆ తర్వాతే బయటకు...
భారీ అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(VIL) ప్రభుత్వానికి కట్టవలసిన రూ.16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చే అవకాశం ఉంది. వేలకోట్ల బకాయికి బదులు కేంద్రానికి వాటా ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. అప్పుడు సంస్థలో అతిపెద్ద వాటాదారుగా ప్రభుత్వం నిలుస్తుంది. వడ్డీ బకాయి కింద ప్రభుత్వానికి 35.8 శాతం వాటా దక్కే అవకాశముందని ఎక్స్చేంజీలకు వొడాఫోన్ ఐడియా సమాచారం ఇచ్చింది. వొడాఫోన్ ఐడియా రూ.1.95 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.
స్పెక్ట్రం వేలం వాయిదా మొత్తం, ఏజీఆర్ బకాయిలపై కట్టవలసిన వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్చేందుకు జనవరి 10న జరిగిన సమావేశంలో బోర్డు డైరెక్టర్లు అంగీకరించారు. కంపెనీ అంచనా ప్రకారం ఈ వడ్డీ నికర వ్యాల్యూ రూ.16,000 కోట్లుగా ఉండవచ్చునని, టెలికం విభాగం ధృవీకరించాలి.
పెద్ద మొత్తంలో బకాయిలు
టెలికం నెట్ వర్క్ సంస్థలకు ప్రకటించిన ఉద్దీపనలో భాగంగా నాలుగేళ్ల పాటు స్పెక్ట్రం బకాయిలు, ఏజీఆర్ బకాయిలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ సమయంలో బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్చుకోవడానికి కంపెనీలకు అవకాశం కల్పించింది. దీంతో 2021 సెప్టెంబర్ నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం స్థూల రుణాలు రూ.1,94,780 కోట్లుగా ఉన్నాయి. ఇందులో స్పెక్ట్రం బకాయిలు రూ.1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయి రూ.63,400 కోట్లు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.22,770 కోట్లు ఇవ్వాలి.
ఎవరి వాటా ఎంతంటే
ఈక్విటీ కేటాయింపుకు పరిగణలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14వ తేదీ నాటికి షేర్ సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకు రూ.10 చొప్పున కనీస వ్యాల్యూలో ఈక్విటీని జారీ చేయనున్నది. టెలికం డిపార్టుమెంట్ తుది ధరను ఖరారు చేస్తుంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్దతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లు సహా వాటాదారులపై ప్రభావం ఉంటుంది. ఈక్విటీ జరీ చేస్తే ప్రభుత్వానికి 35.8 శాతం వాటా, ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ వాటా 28.5 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్ వాటా 17.8 శాతంగా ఉంటుంది.
ఆ తర్వాత ప్రభుత్వం బయటకు
వొడాఫోన్ ఐడియా కంపెనీలో ఈక్విటీలను ప్రభుత్వానికి కేటాయిస్తామని వెల్లడించడంతో ఈ స్టాక్ పడిపోయింది. బీఎస్ఈలో 20.54 శాతం నష్టంతో రూ.11.80 వద్ద, ఎన్ఎస్ఈలో 20.88 శాతం నష్టంతో రూ.11.75 వద్ద ముగిసింది.మరోవైపు, వొడాఫోన్ ఐడియాలో వాటాలకు ప్రభుత్వం సన్నద్ధంగా లేదు. కంపెనీ సుస్థిరతను సాధించాక బయటకు వెళ్తుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించే బకాయిలను ఈక్విటీలుగా మార్చాలని టాటా టెలీ సర్వీసెస్ కూడా భావిస్తోంది. దీంతో టాటా టెలీలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేయడానికి వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించింది.