pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
pmay: వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు, PM కిసాన్ పథకం నిధుల పెంపు వంటి ఎన్నో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. PM ఆవాస్ యోజన కింద పేదల ఇళ్ల కోసం ఈ బడ్జెట్ లో 40 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కానీ గతేడాదితో పోలిస్తే సుమారు 10 వేల కోట్లు తగ్గించనుండటం గమనార్హం.
గతేడాదితో పోలిస్తే..
PMAY పథకానికి 2022 బడ్జెట్లో 48 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లక 28 వేల కోట్లు, మిగిలిన మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణాల కోసం వెచ్చించడానికి నిర్ణయించింది. ఫిబ్రవరి 1 న లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో.. ఈసారి 40 వేల కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన వెలువడనుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఎలక్షన్స్కు వెళ్లేముందు..
2024 వకు 84 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇదే చివరి బడ్జెట్ కానుండటం, వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లాల్సి ఉండటంతో.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంది.
ఏమిటి ఈ PMAY ?
తక్కువ, మధ్య తరగతి ఆదాయ వర్గాలకు గృహాల కొరతను పరిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే లక్ష్యంతో 2015లో PMAY పథకాన్ని ప్రారంభించింది. హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ ఈ గృహాల కేటాయింపులను పర్యవేక్షిస్తుంటుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్నందును 2022 మార్చి నాటికి అర్హులైన వారికి పక్కా గృహాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానిని ఇప్పుడు డిసెంబరు 31, 2024 వరకు పొడిగించారు.