రాజకీయ నేతల ఆర్థిక లావాదేవీలు ట్రాకింగ్ కు కేంద్రం ఆదేశాలు.. జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..
money laundering: భారత్ లో రాజకీయాలు మనీ చుట్టూ తిరుగుతాయి అన్న విషయం తెలిసిందే. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నగదు, మద్యం ఏరులై పారాల్సిందే. ఏకంగా పార్లమెంట్లోనూ నోట్ల కట్టలు గుంపగుత్తగా కుమ్మరించడమూ విధితమే. ప్రజాస్వామ్యాన్ని సైతం అపహాస్యం చేసే విధంగా మన పాలకులు ప్రవర్తించిన తీరును అంత త్వరగా మర్చిపోలేము. ఆయా నేతలు, పార్టీలకు వస్తున్న ఫండింగ్ పై దేశవ్యాప్తంగా పలు ఆరోపణలు వస్తుండటంతో.. కేంద్రం కొత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్చి 7 నుంచి అమలు
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 2005కు కేంద్రం కొన్ని సవరణలు చేసింది. పొలిటికల్లీ ఎక్స్ పోజింగ్ పర్సన్స్(PEP)కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థలకూ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. మార్చి 7 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలవుతున్నట్లు ప్రకటించింది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, NGOల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నూ ట్రాక్ చేయాలని ఆదేశించింది.
ఇదీ రాజకీయ నాయకుల జాబితా
దేశంలోని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు, సీనియర్ రాజకీయ నాయకులు, ప్రభుత్వం న్యాయ సైనిక విభాగాల సీనియర్ అధికారులు, ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్లలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు సహా విదేశాలతో సంబంధాలు కలిగిన ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల అధిపతులను ఈ PEP జాబితాలోకి చేర్చినట్లు కేంద్రం వెల్లడించింది. సవరించిన మనీ లాండరింగ్ నియమాల ప్రకారం వీరి ఖాతాలను ట్రాక్ చేయాల్సిన లిస్టులో పేర్కొంది
ఐదేళ్లపాటు సేవ్ చేయాల్సిందే..
నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, NGOల లావాదేవీల వివరాలను బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థలు ట్రాక్ చేసే విధానాన్ని సైతం కేంద్రం తన గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. నీతి ఆయోగ్ కి సంబంధించిన దర్పణ్ పోర్టల్ లో ఈ తరహా కస్టమర్ల వివరాలను నమోదు చేయడం తప్పనిసరి చేసింది.
ఆయా సంస్థలతో వ్యాపార సంబంధాలు ముగిసిన ఐదేళ్ల వరకు ఈ డేటాను భద్రపరచాలని ఆదేశించింది. తాజా నిబంధనల ప్రకారం.. కేవలం ఖాతాల నిర్వహణ మాత్రమే కాకుండా అవసరమైనప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)తో సైతం వివరాలను పంచుకోవాలని ఆదేశించింది.