పెద్ద బ్యాంకులు బెట్టర్, మోడీ 5 ట్రిలియన్ డాలర్ల కల నెరవేరాలంటే..
ఇప్పటికే వివిధ బ్యాంకులను విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం అవసరమైతే మరిన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అవసరాలకు అనుగుణంగా మరిన్ని బ్యాంకులను విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. దేశ ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ప్రభుత్వం పది బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ ఎఫెక్ట్: శాలరీలేని జీవితాలు, ఉద్యోగాల కోత
అవసరమనుకుంటే మరిన్ని బ్యాంకుల విలీనం
2017లో భారత్లో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అవి 12కు తగ్గనున్నాయి. విజయవంతంగా బ్యాంకుల విలీనం పూర్తయిందని, మూలధన పునర్వ్యవస్థీకరణలను చేశామని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దివాలా స్మృతితో బ్యాంకులకు రూ.4 లక్షల కోట్లు తిరిగి వచ్చాయన్నారు. భవిష్యత్తులో అవసరమనుకుంటే మరిన్ని బ్యాంకుల విలీనం ఉంటుందని తెలిపారు.
పెద్ద బ్యాంకులు ఉంటేనే మంచిది
ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షల మేరకు 2024-24 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి అంతర్జాతీయస్థాయి బ్యాంకులు ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6 అంతర్జాతీయస్థాయి బ్యాంకులు మన దేశంలో ఉన్నట్లవుతుందని చెప్పారు. పెద్ద బ్యాంకులు ఉంటేనే ఖాతాదారులకు మంచి సేవలు అందించగలమని చెప్పారు. బలమైన రుణ వితరణ సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు.
ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు
పెద్ద బ్యాంకులతో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని ఠాకూర్ పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ నెలలో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును SBIలో విలీనం చేశారు. అనంతరం 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు. మరిన్ని బ్యాంకులను కూడా విలీనం చేశారు. దీంతో బ్యాంకుల సంఖ్య 12కు తగ్గింది.
రూ.90,000 కోట్ల దాకా సమీకరించాలని..
LIC లిస్టింగ్ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరుగుతుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఎల్ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 100%, ఐడీబీఐలో 46.5% వాటాలున్నాయి. రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటుతో పాటు గత ఏడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం చేకూరిందని ఠాకూర్ తెలిపారు.