రాష్ట్రాల తరఫున కేంద్రం అప్పులు, రూ.1.1 లక్షల కోట్ల సమీకరణ
జీఎస్టీ పరిహారం చెల్లింపు కోసం కేంద్రం విడతలవారీగా రుణాలు తీసుకొని ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. స్పెషల్ విండో ఏర్పాటు చేస్తున్నందుకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు కిందకు రాదని తెలిపింది. ఆప్షన్ 1 కింద రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్ల రుణం అందించేందుకు స్పెషల్ విండో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
జీఎశ్డీపీలో 0.5 శాతం రుణాలు తీసుకోవడానికి ఇటీవల వీటికి అనుమతి ఇవ్వగా, అదనంగా ఈ మొత్తం సమకూరుస్తామని తెలిపింది. కరోనా కారణంగా ఆర్థిక వనరులు కోల్పోయిన రాష్ట్రాలకు రెండు శాతం మేర అధనపు రుణాలు సేకరించేందుకు సంస్కరణ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చామని, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో రుణాలు ఉపయోగించుకోలేకపోతే మరుసటి ఏడాది ఉపయోగించుకునేలా ఆప్షన్ 1 రాష్ట్రాలకు అదనపు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.
కేంద్రం ఇచ్చే రుణం రాష్ట్రాల మూలధన ఆదాయ పద్దుల్లో కనిపిస్తుందని, ఆర్థిక లోటు భర్తీ కింద ఈ మొత్తం వచ్చినట్లుగా ఉంటుందని వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో రుణ సేకరణకు వెళ్లినప్పుడు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వడ్డి ఉంటుందని, ఇప్పుడు కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల ఆ తేడా ఉండదని తెలిపింది. అయితే, వడ్డీ, అసలు ఎవరు చెల్లిస్తారనే అంశాన్ని తెలియజేయాల్సి ఉంది.