పెట్రోల్, డీజిల్ తరువాత ఇక వంటనూనెలపై: కేంద్రం కీలక నిర్ణయాలు: కాగుతున్న రేట్లపై
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిన్న, మొన్నటిదాకా ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 120 రూపాయలను సైతం దాటిన రాష్ట్రాలు ఉన్నాయి. చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా డీజిల్ సైతం 110 రూపాయల మార్క్ను దాటిన పరిస్థితులను చూశాం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అమలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్పై ఎనిమిది, డీజిల్పై ఆరు రూపాయలను తగ్గించింది. ఫలితంగా ఈ రెండింటి ధరలు దిగొచ్చాయి. ప్లాస్టిక్ తయారీకి వినియోగించే ముడి పదార్థాలు, ఐరన్ అండ్ స్టీల్ రేట్లు కూడా తగ్గేలా కిందటి వారమే కేంద్రం చర్యలు చేపట్టింది.
చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు: షుగర్ షేర్ల ధరలు ఢమాల్
వంటనూనెల ధరలు తగ్గించేలా..
ఇప్పుడు తాజాగా- ఇలాంటి మరో కీలక నిర్ణయాన్ని తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సలసలమంటూ కాగుతున్న వంటనూనె ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సన్ఫ్లవర్, సోయాబీన్ నూనె దిగుమతులపై వసూలు చేస్తోన్న ట్యాక్స్ను తగ్గించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. వేర్వేరు కారణాల వల్ల భారీగా పెరిగిన వంటనూనె రేట్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని తగ్గించడమే మార్గమని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆ సెస్ రద్దు..?
అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ రూపంలో అదనంగా వసూలు చేస్తోన్న అయిదు శాతం పన్నును పూర్తిగా రద్దు చేయడమా? లేక దీన్ని తగ్గించడమా? అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఈ వారమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని స్పష్టం చేస్తోన్నాయి. దీనిపై వ్యాఖ్యానించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అందుబాటులో రాలేదు.
వంటనూనెలపై లెవీలు రద్దు..
కాగా- పామాయిల్ వంటి వంటనూనెల దిగుమతులపై వసూలు చేస్తోన్న సాధారణ పన్నులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. దిగుమతి లెవీని తొలగించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సుమారు 60 శాతం వరకు వాటి ధరలో పెరుగుదల కనిపించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం ఎఫెక్ట్..
నల్లసముద్రం ద్వారా వంటనూనెల తరలింపు సాధ్య పడకపోవడం కూడా దీనికి ఓ కారణమైంది. ఫలితంగా రవాణా ఖర్చు పెరిగిందనేది కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న మాట. దాని తరువాత ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధాన్ని విధించింది ఫలితంగా వాటి రేట్లు పైపైకి ఎగబాకాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో - దాన్ని కొంతమేరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.