వాహన, ఆరోగ్య బీమా చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీ వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో వ్యాపార, వాణిజ్య.. ఇలా ఒకటేమిటి అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ పెద్ద విపత్తు నుండి గట్టెక్కేందుకు కేంద్రం లాక్ డౌన్ సందర్భంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్, పప్పు, గ్యాస్ సిలిండర్ ఇస్తోంది. అంతేకాదు, ఉద్యోగులు, వ్యాపారులకు ఈఎంఐ చెల్లింపుల నుండి ఊరట కల్పించాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. తాజాగా వాహన బీమా, ఆరోగ్య బీమా విషయంలో మరో ఊరట కల్పించింది.
ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం: ఐక్యరాజ్య సమితి, భారత్-చైనాలకు మాత్రం ఊరట!
వాహన, ఆరోగ్య బీమా గడువు పొడిగింపు
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆరోగ్య, వాహన బీమా ప్రీమియం చెల్లింపు గడువును పొగిడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉందని, కాబట్టి ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.
ఏప్రిల్ 21 వరకు గడువు
మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ మధ్య చెల్లించాల్సిన ఆరోగ్య బీమా, వాహన బీమా ప్రీమియంను ఏప్రిల్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చునని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ పొడిగింపు ద్వారా 130 కోట్ల మంది జనాభాలో 44 శాతం మందికి ఉపశమనం దక్కుతుంది.
బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ ఊరట
ఇదిలా ఉండగా, కరోనా కారణంగా బీమా కంపెనీలకు నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ ఇదివరకు ఊరట కల్పించింది. 2020-21 సంవత్సరానికి గాను రీఇన్సురెన్స్ పతకాలను సమర్పించేందుకు సడలింపులను ప్రకటించింది. కొన్ని నిబంధనలపై ఉన్న గడువుల విషయంలోని ఐఆర్డీఐఏ(రీ-ఇన్సురెన్స్) నిబంధనలు, 2018లోని మార్గదర్శకాలను సడలించారు. బీమా కంపెనీల కార్యకలాపాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30, 2020 వరకు బోర్డు ఆమోదించిన తుది రీ-ఇన్సురెన్స్ ప్రణాళికను సమర్పించాలి. దానిని మే 31, 2020 వరకు పొడిగించారు.