ఐటీసీ ప్రైవేటీకరణకు ముహూర్తం ఫిక్స్: అమ్మకానికి మరో కంపెనీ కూడా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం- తన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రభుత్వరంగ కంపెనీల్లో తన వాటాలను విక్రయించనుంది. వాటిని ప్రైవేటీకరించనుంది. ఈ సంవత్సరం ప్రైవేటీకరణ ప్రక్రియ ద్వారా కనీసం 70,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.
గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా, జీవిత బీమా సంస్థల్లో తన పెట్టుబడులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పవన్ హన్స్ లిమిటెడ్ నుంచి తన వాటాలను విక్రయించుకోవడానికి ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఇదివరకే స్టార్9 మొబిలిటీ బిడ్డింగ్కు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) ఆమోదం తెలిపినప్పటికీ.. దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు వార్తలు వస్తోన్నాయి.
జూన్లో మళ్లీ దీనికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంది. దీనితోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐటీసీ, హిందుస్తాన్ జింక్ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహకాలను త్వరలో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంటే అక్టోబర్-నవంబర్-డిసెంబర్లో ఈ రెండింటినీ ప్రైవేటీకరించాలని భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.
హిందుస్తాన్ జింక్ లిమిటెడ్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా 29.54 శాతం. దీని విలువ సుమారు 37,000 కోట్ల రూపాయలు. ఐటీసీలో ఉన్న పెట్టుబడుల శాతం 7.91. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా ఐటీసీలో పెట్టుబడులను పెట్టింది. ఇప్పుడీ రెండింట్లోనూ వందశాతం మేర తన వాటాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండింటినీ ప్రైవేటీకరించడం ద్వారా కనీసం 65,000 నుంచి 70,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా- ఇప్పటికే జీవితబీమా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది ఎల్ఐసీ. 21,000 కోట్ల రూపాయలను సేకరించుకోవాలనే లక్ష్యంతో ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేసినప్పటికీ.. అది విఫలమైంది. 20,500 కోట్ల రూపాయలే సమకూరాయి. పైగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్లోకి వచ్చిన తరువాత ఎల్ఐసీ ఐపీఓ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. 949 రూపాయలుగా ఉన్న ఎల్ఐసీ షేర్ ధర.. ఇవ్వాళ రూ.814.80 పైసల వద్ద ట్రేడింగ్ అయింది.