కరోనా ఎఫెక్ట్: కొత్త కార్లు కొనొద్దు.. ఖర్చులు తగ్గించండి! బ్యాంకులకు ఆర్థిక శాఖ హుకూం
కరోనా కష్టాలు ఇన్నిన్ని కావయా.... అనే కవితలు రాసుకోవాల్సిన పరిస్థితి. ఈ మాయదారి మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పనుల్లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆదాయం పెరిగేది లేదు... కానీ ఖర్చులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల ముందున్న ఏకైక అస్త్రం పొదుపు మాత్రమే. కానీ ముందు ఎంతో కొంత ఆదాయం ఉంటేనే కదా పొదుపు చేసేది? మన విషయం పక్కకు పెడితే.. కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం ఇదే పొదుపు మంత్రాన్ని పాటించాలని తన ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) కు ఆదేశాలు జారీ చేసింది.
అయినదానికీ కాని దానికి ఎడాపెడా ఖర్చులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో చేతిలో ఉన్న రూపాయితో పనికొచ్చే పని ... అంటే కోర్ ఆక్టివిటీ ఐన రుణాలు మంజూరు చేసి దానిపై ఆదాయాన్ని ఆర్జించాలనేది ఉవాచ. అందుకే ఒక ఏడాది పాటు వృధా ఖర్చులు ఏమీ చేయకూడని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులు సైతం అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఇబ్బందులున్నా ఈ కంపెనీలో ఉద్యోగుల తొలగింత లేదు, ప్రమోషన్లు, శాలరీ హైక్
కొత్త కార్ల కు నో...
సాధారణంగా బ్యాంకు ఉన్నతాధికారుల కోసం ప్రతి ఏటా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ కోట్లలో ఖర్చు చేస్తాయి. ఇందులో కొత్త కార్ల కొనుగోలు, లేదా ఇప్పటికే ఉన్నవాటి కి కొత్త ఇంటీరియర్స్ అమర్చటం, గెస్ట్ హౌస్ ల రీ ఇంబర్సుమెంట్, ట్రావెల్ ఖర్చులు ఇలాంటి అనేక అంశాలపై భారీగా వెచ్చిస్తాయి. కానీ, ఇకపై ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కొత్త కార్ల కొనుగోలు చేయకూడదని, అలాగే కొత్త ఇంటీరియర్స్ వేయించటం కూడా ఒద్దని ఆర్థిక శాఖ ఆదేశాల్లో పేర్కొంది. అందులో గెస్ట్ హౌస్ రీ ఇంబర్సుమెంట్లు సహా అనేక అప్రధాన అంశాలపై ఖర్చులు పూర్తిగా మానేయాలని కోరింది. ఇటీవల ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు మూడు ఆడిట్ల కోసం ఏకంగా రూ 1.34 కోట్లు ఖర్చు చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆర్థిక శాఖ అన్ని రకాల వృధా ఖర్చులను తగ్గించాలని సూచించింది.
పబ్లిసిటీ, కాన్ఫరెన్స్ తగ్గింపు...
ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిసిటీ కోసం కూడా భారీగా ఖర్చు చేస్తుంటాయి. అలాగే రకరకాల సమావేశాల పేరిట పెద్ద ఎత్తున డబ్బు ఖర్చవుతుంది. దీనిని గుర్తించిన ఆర్థిక శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిసిటీ, కాన్ఫరెన్స్ లపై పెట్టే ఖర్చులను తప్పనిసరిగా 20% తగ్గించాలని సూచించింది. కోవిడ్ -19 దరిమిలా... ఖర్చులు తగ్గించుకునేందుకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఆర్థిక వనరులను కోర్ ఆక్టివిటీ కోసం వెచ్చించేందుకు సిద్ధం కావాలి అని ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. అన్ని బ్యాంకులు కూడా ఈ ఆర్డర్ ను అమలు చేసేందుకు తదుపరి బోర్డు మీటింగ్లో చర్చించి, తగిన విధంగా అంతర్గత ఆదేశాలను జారీ చేయాలనీ కూడా ఆర్థిక శాఖ కోరింది. ఖర్చు తగ్గింపు కేవలం వీటికే పరిమితం కావటం లేదు. అధికారుల టీఏ, డీఏ లు సహా ఇతర అలవెన్సు ల పై కూడా ప్రభావం పడనుంది.
తగ్గిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ...
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య భారీగా ఉండేది. కానీ చాలా బ్యాంకులను విలీనం చేసి పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. దీంతో ఏప్రిల్ 1, 2020 నుంచి దేశంలో కేవలం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మనుగడలో ఉన్నాయి. అంతకు ముందు వీటి సంఖ్య 27 కావటం గమనార్హం. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఐన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లో దాని 7 అనుబంధ బ్యాంకుల విలీనంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకు లో విలీనం చేయటం వరకు కొనసాగింది. దీంతో ప్రస్తుతం కేవలం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాత్రమే మిగిలాయి. ప్రస్తుత ఆర్థిక శాఖ ఉత్తర్వులు వీటికే వర్తిస్తాయి. అయితే మిగితా బ్యాంకులు కూడా దీనినే ఫాలో అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.