adani: అదానీ వ్యవహారంపై స్పందించిన అమిత్ షా.. BBC డాక్యుమెంటరీ, కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగంపైనా వ్యాఖ్యలు
adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూపులో చెలరేగిన విధ్వంసం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు గంగలో కలిసిపోయాయి. ఈ విషయంపై కేంద్రం మంత్రులు ఎవరూ నెగటివ్ గా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఇండియా టుడే కాన్ క్లేవ్ 2023లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అదానీ సంక్షోభం, BBC డాక్యుమెంటరీ, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి పలు అంశాలపై ఆయన శుక్రవారం మాట్లాడారు.
కోర్టులపై నమ్మకం ఉంచండి:
అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ గురించిన ఓ ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు. ఈ విషయంపై తమ ప్రభుత్వానికి ఎటువంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. అదానీ సంస్థల గురించి దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. న్యాయస్థానమే ఈ వ్యవహారాన్ని తేలుస్తుందని, కోర్టులపై ప్రజలు విశ్వాసముంచాలన్నారు.
సెబీ, సుప్రీం దర్యాప్తు చేస్తున్నాయ్..
అదానీ గ్రూపు కంపెనీల్లో ఏవైనా అక్రమాలు జరిగినట్లు ఎవరిదగ్గరైనా రుజువులు ఉంటే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ముందు వాటిని సమర్పించ వచ్చని కేంద్ర హోం మంత్రి తెలిపారు. తప్పు జరిగినట్లు నిర్ధారణైతే ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అయితే కమిటీ నివేదిక సైతం తప్పు అని భావిస్తే అప్పుడు ఆరోపణలు చేయవచ్చంటూ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. దీనిపై సెబీ దర్యాప్తు జరుపుతున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి ఇప్పటికే నివేదించిందని గుర్తుచేశారు.
BBC డాక్యుమెంటరీ:
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా BBC ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అమిత్ షా స్పందించారు. 2002 నాటి సంఘటనలపై 2023లో డాక్యుమెంటరీ విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మరో ఏడాదిలో జాతీయ స్థాయి ఎన్నికలకు వెళ్లనుండగా.. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడం పలు అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. అందుకే దాని ప్రసారంపై భారత్ లో నిషేధం విధించినట్లు చెప్పారు.
కేంద్ర సంస్థల దుర్వినియోగం:
ఎటువంటి కేంద్ర ఏజెన్సీలూ చట్టానికి అతీతం కాదని షా స్పష్టం చేశారు. CBI, EDలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై ఆయన సమాధానమిచ్చారు. అవినీతి కేసుల్లో కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడంలో తప్పు ఏముందన్నారు. ఏది ఏమైనా 2024లోనూ పూర్తి మెజారిటీతో మరోసారి BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం తథ్యమన్నారు.