దక్షిణాదిన మళ్లీ పెరిగిన సిమెంట్ ధరలు, రూ.20కి పైగా పెంపు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్యల కారణంగా నూనె, ప్లాస్టిక్తో పాటు సిమెంట్ ధరలు తగ్గుతాయని భావించారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తాజాగా పెరిగాయి. ఈ మేరకు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 50 కిలోల సిమెంట్ బస్తా ధరను రూ.20 నుండి రూ.30 వరకు పెంచుతూ నిర్ణయించాయి. పెరిగిన ధరలు 2వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు వెల్లడించాయి.
ముడి పదార్థాల అధిక ధరలకు తోడు ఇంధన వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెంచవలసి వచ్చిందని చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.20 చొప్పున, తమిళనాడులో రూ.30 వరకు, కర్నాటకలోను దాదాపు అంతేస్థాయిలో పెరిగింది. ధర పెరిగిన తర్వాత ఏపీ, తెలంగాణలలో రూ.320 నుండి రూ.400 వరకు, తమిళనాడు, కర్నాటకలలో రూ.360 నుండి రూ.450 వరకు ఉంది.
అల్ట్రా టెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, కేసీపీ, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, భారతి, శ్రీ సిమెంట్, రామ్ కో, ఓరియంట్ సిమెంట్స్ తదితర కంపెనీలు ధరలు పెంచాయి. ఏప్రిల్ నెలలోనే ధరలు పెంచాలని భావించినప్పటికీ, డిమాండ్ లేకపోవడంతో డీలర్లు ససేమీరా అన్నారు. దీంతో అప్పుడు కంపెనీలు పెంపు నిర్ణయాన్ని పక్కన పెట్టాయి. ఇప్పుడు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాయి.