హైదరాబాద్ సహా దక్షిణాదిన ఆ కంపెనీకి షాక్: కంపెనీల 'మార్కెట్' పోటీ!
ఏషియన్ పేయింట్స్ పైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) దర్యాఫ్తుకు ఆదేశించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పేయింట్స్ రంగంలోకి జేఎస్డబ్ల్యూ ఇటీవల అడుగు పెట్టింది. ఈ రెండు ఇఫ్పుడు కత్తులు నూరుకుంటున్నాయి. దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలలో తమ ఉత్పత్తులను విక్రయించకుండా డీలర్లను ఏషియన్ పేయింట్స్ బెదిరిస్తోందని జేఎస్డబ్ల్యూ CCIకి ఫిర్యాదు చేసింది. CCI దర్యాఫ్తుకు ఆదేశించింది.
మింత్రతో జతకట్టిన మహేష్ బాబు బ్రాండ్: రూ.599 నుంచి ధర ప్రారంభం
పేయింట్స్ రంగంలోకి అడుగు
జిందాల్ సారథ్యంలోని JSW గ్రూప్ స్టీల్, విద్యుత్, సిమెంట్ తయారీలో ఉంది. గత ఏడాది మే నెలలో పేయింట్స్ రంగంలోకి అడుగు పెట్టింది. JSW పేయింట్స్ లక్ష కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన డెకరేటివ్ పేయింట్స్ తయారీ ఇండస్ట్రీని నెలకొల్పింది. ఈ సంస్థ దక్షిణాదితో పాటు పశ్చిమ రాష్ట్రాలపై దృష్టి సారించింది. రానున్న అయిదేళ్లలో దేశవ్యాప్తంగా పది శాతం మార్కెట్ వాటాతో, దేశంలోని మూడో పెద్ద పేయింట్స్ సంస్థగా ఎదగాలని భావిస్తోంది.
హెచ్చరిస్తోంది..
దక్షిణాది నుంచి తమ ప్రస్థానం ప్రారంభిస్తుంటే ఏషియన్ పేయింట్స్ మాత్రం తమ ప్రయత్నాలను అడ్డుకుంటోందని CCIకి JSW ఫిర్యాదు చేసింది. దక్షిణాదిలోని ముఖ్య నగరాలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, హుబ్లీ, కొచ్చి, కోజీకోడ్ నగరాల్లో డీలర్లను సంప్రదించి తమ పేయింట్స్ విక్రయించాలని కోరితే.. సదరు డీలర్లను ఏషియన్ పేయింట్స్ హెచ్చరిస్తోందని ఆరోపిస్తోంది.
సరఫరా తగ్గించి, రాయితీలు నిలిపివేత
JSW పేయింట్స్ విక్రయిస్తే తాము పేయింట్స్ సరఫరా తగ్గించడమే కాకుండా రాయితీలు నిలిపివేస్తామని డీలర్లను ఏషియన్ పేయింట్స్ హెచ్చరిస్తోందని, దీంతో తమ వద్ద రూ.1 లక్ష డిపాజిట్ చేసిన డీలర్లు కూడా వెనుకంజ వేస్తున్నారని JSW పేర్కొంటోంది.
మార్కెట్ విస్తరణ..
JSWకు ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో మార్కెట్ విస్తరించుకుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, గుజరాత్లకు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. అయితే తమకు ఏషియన్ పేయింట్స్ అడ్డుపడుతోందని ఆరోపిస్తూ CCIకి ఫిర్యాదు చేయగా, దర్యాఫ్తు చేపట్టి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ను ఆదేశించింది. గతంలో నిప్పోన్ పేయింట్స్ అడుగుపెట్టినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.
మార్కెట్ లీడర్ ఏషియన్ పేయింట్స్
ఏషియన్ పేయింట్స్ మార్కెట్ లీడర్గా ఉంది. వ్యాల్యూమ్, వ్యాల్యూ, ప్రాఫిట్ పరంగా వరుసగా 51 శాతం, 58 శాతం, 64 శాతంతో ఉంది. మార్కెట్లో టాప్ 4 కంపెనీల మార్కెట్ వ్యాల్యూ 98 శాతంగా ఉంది. ఏషియన్ తర్వాత నెరోలాక్, బెర్జర్ పేయింట్స్, అక్జో నెబెల్, ఇండిగో పెయింట్స్, నిప్పోన్ పెయింట్స్ ఉన్నాయి.
పేయింట్స్ మార్కెట్ వృద్ధి
మన దేశంలో జీడీపీ వృద్ధి రేటు కంటే 1.5 శాతం నుంచి 2 శాతం అధికంగా పేయింట్స్ పరిశ్రమలో వృద్ధి నెలకొంది. ఇండియన్ పెయింట్స్ అసోసియేషన్ ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి పేయింట్స్ మార్కెట్ వ్యాల్యూ ప్రస్తుతం ఉన్న రూ.50వేల కోట్ల నుంచి రూ.70వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.