Google: గూగుల్ బెదిరింపులకు తలవంచని CCI.. వారం రోజుల్లో రెండో సారి షాక్.. కంగుతిన్న టెక్ దిగ్గజం..
Google: అమెరికా కంపెనీలు వ్యాపారం కోసం ఏకపక్షంగా చేసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లో భారత్ ఉపేక్షించదని మరోసారి తేల్చి చెప్పింది కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలోనే ఈనెల 20న సీసీఐ అమెరికా టెక్ దిగ్గజంపై రూ.1,337.76 కోట్ల జరిమానా విధించింది.
గూగుల్ జవాబు..
భారత ప్రభుత్వ సంస్థ వేలకోట్లు పెనాల్టీ విధించటంతో గూగుల్ దానిపై అప్పట్లో స్పందించింది. గుత్తాధిపత్యం అంటూ సీసీఐ చేసిన ఆరోపణలపై రివ్యూ జరుగుతోందని, తర్వాత ఎలా ముందుకు సాగాలో నిర్ణయిస్తామని కంపెనీ చెప్పింది. సీసీఐ చర్యలు తమ వ్యాపారానికే కాక భారత కస్టమర్లకు ఇబ్బందికరమైనవని బెదిరింపులకు దిగింది. ఈ నిర్ణయం చివరికి భారత కస్టమర్లకే ఎదురుదెబ్బగా ముగుస్తుందని గూగుల్ ప్రతినిధి బిజినెస్ టుడే వార్తా సంస్థతో అన్నారు.
కానీ ఇప్పుడు..
గూగుల్ నుంచి ఘాటు హెచ్చరికలు వచ్చినప్పటికీ.. సీసీఐ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. పైగా తాజాగా అక్టోబర్ 25న రూ.936.44 కోట్ల పెనాల్టీని విధించింది. ఈ సారి గూగుల్ ప్లే స్టోర్ గుత్తాధిపత్యంపై కాంపిటీటివ్ కమిషన్ విరుచుకుపడింది. Google తన Play Store విధానాలకు సంబంధించి వ్యాపారంలో తనకు ఉన్న ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు జరిమానా విధించింది.
30 రోజులు గడువు..
దీనిపై గూగుల్ స్పందించేందుకు, తగిన అధారాలను సమర్పించేందుకు 30 రోజుల గడువును సీసీఐ ఇచ్చింది. అయితే నవంబర్ 2020లో చెల్లింపు యాప్లు, యాప్లో కొనుగోళ్ల కోసం Google Play Store చెల్లింపు వ్యవస్థను తప్పనిసరిగా ఉపయోగించడంపై CCI విచారణకు ఆదేశించింది. యాప్ డెవలపర్లు తమకు నచ్చిన చెల్లింపు ప్రాసెసింగ్ సిస్టమ్ను ఎంచుకునే సామర్థ్యాన్ని పరిమితం చేయటం అన్యాయమని కమిషన్ తన ప్రాథమిక అభిప్రాయంగా పేర్కొంది.
తనకు ఒక రూల్.. బయటి వారికి మరొకటి..
టెక్ దిగ్గజం యూట్యూబ్ వంటి దాని సొంత యాప్ల కోసం తన బిల్లింగ్ సిస్టమ్ను ఉపయోగించడం లేదని దర్యాప్తులో సీసీఐ కనుగొంది. ఇతరులకు సొంత బిల్లింగ్ సిస్టమ్ తప్పనిసరి చేయటం వల్ల.. ఇన్నోవేషన్ ఇన్సెంటివ్లను, చెల్లింపు ప్రాసెసర్లు అలాగే యాప్ డెవలపర్లు సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణలను చేపట్టే సామర్థ్యానికి ఇది భంగం కలిగిస్తుందని కమిషన్ పేర్కొంది.