ట్యాక్స్పేయర్ల నెత్తిన పాలు పోసిన నిర్మలమ్మ: వేల కోట్ల రూపాయల రీఫండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ బిగ్ రిలీఫ్ ఇచ్చింది.. 22 లక్షల మంది ట్యాక్స్ పేయర్లకు గుడ్న్యూస్ వినిపించింది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ప్రకటనను వెలువడించింది. ట్యాక్స్ పేయర్లకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తామని ఆదాయపు పన్నుల శాఖ తెలిపింది. దీని విలువ 49 వేల కోట్ల రూపాయల పైమాటే. ఈ మేరకు కొద్దిసేపటి కిందట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ట్వీట్ చేసింది.
సీబీడీటీ చేసిన ఈ ప్రకటన వల్ల 22.75 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ఆరంభమైనప్పటి నుంచి అంటే.. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయని వారి నుంచి పెనాల్టీ విధించిన విషయం తెలిసిందే. వాటన్నింటినీ వెనక్కి తిరిగి చెల్లించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు మొత్తంగా 49,696 కోట్ల రూపాయలను రీఫండ్ చేసినట్లు వివరించింది.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయని వారి నుంచి ఆలస్య రుసుమును వసూలు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో చోటు చేసుకున్న సాంకేతిక లోపం, తప్పిదాలే దీనికి కారణమని ఆ తరువాత గుర్తించారు ఆ శాఖ అధికారులు. సాంకేతిక లోపం వల్ల ఈ పరిణామం తలెత్తిన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల జాప్యం లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ట్యాక్స్ పేయర్ల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తామని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో భాగమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
అదనపు వడ్డీ, ఆలస్య రుసుముల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు ఈ అయిదు నెలల కాలంలోనే రాబట్టిన మొత్తం విలువ 49,696 కోట్ల రూపాయలు. ఇందులో కార్పొరేట్ ట్యాక్సుల వాటా అధికం. కార్పొరేట్ ట్యాక్సుల రూపంలో 35,088 కోట్ల రూపాయల మొత్తాన్ని అధిక వడ్డీ, ఆలస్య రుసుముగా వసూలు చేసింది. 1,24,732 కార్పొరేట్ కేసులు ఉన్నాయి. మిగిలిన 14,608 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇండివిడ్యువల్స్ నుంచి వసూలు చేసింది. ఇలాంటి కేసులు 21,50,668 ఉన్నాయి. మొత్తం 22.75 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసింది.
అలాగే- పన్ను చెల్లింపుదారులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడానికి లేటెస్ట్ వెర్షన్ ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. పొరపాటు తమవైపే ఉండటం వల్ల ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును కూడా పొడిగింది. ఇక ట్యాక్స్ పేయర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా తమ ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి వెసలుబాటును కల్పించింది. ఇదివరకు ఈ గడువు జూలై 31వ తేదీ వరకే ఉండేది.
CBDT issues refunds of over Rs. 49,696 crore to more than 22.75 lakh taxpayers between 1st April, 2021 to 16th August, 2021. Income tax refunds of Rs. 14,608 crore have been issued in 21,50,668 cases & corporate tax refunds of Rs. 35,088 crore have been issued in 1,24,732 cases.
— Income Tax India (@IncomeTaxIndia) August 21, 2021
గడువు పొడిగించినా కూడా అంటే జూలై 31 తరువాత కూడా ఐటీ రిటర్నులను దాఖలు చేసిన వారిపైనా పన్ను చెల్లింపుదారుల నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆలస్య రుసుము లేదా వడ్డీని వసూలు చేసింది. ఈ డబ్బులను మళ్లీ వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం లక్షలాది మందికి బిగ్ రిలీఫ్ కలిగించినట్టయింది. వారు కట్టిన సొమ్ము మళ్లీ వెనక్కి రానుంది.