డిజిటల్ కరెన్సీ వచ్చినప్పటికీ నగదుకు మనుగడ
కేంద్ర బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు(RBI) డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెట్టినప్పటికీ భౌతిక రూపంలో గదు చలామణి కొనసాగుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీకి పొంచి ఉన్న ముప్పులో సైబర్ భద్రత ఒకటి అన్నారు. గోప్యత కూడా సమస్యగా పరిణమించిందన్నారు. సోమవారం ఎన్సీఈఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగిన సదస్సులో మాట్లాడారు.
డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాక ద్రవ్య సరఫరా నియంత్రణపై ఆర్బీఐ పట్టు తగ్గవచ్చునని, ఆర్థిక స్థిరత్వం కూడా సమస్యగా మారవచ్చునని చెప్పారు. క్రిప్టో కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా అధికారిక డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్బీఐ ఇదివరకే ప్రకటించింది.
బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టో లేదా వర్చువల్ కరెన్సీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని దువ్వూరి సుబ్బారావు చెప్పారు. భారత్, చైనా వంటి దేశాల నుండి సొమ్మును బయటి దేశాలకు తరలించేందుకు, మనీలాండరింగ్ క్రిప్టో కరెన్సీలు ప్రధాన వాహకాలుగా కాగలవని చెప్పారు. అయినప్పటికీ స్పెక్యులేటివ్ అసెట్స్గా క్రిప్టోలు కొనసాగుతాయన్నారు.