గుడ్న్యూస్: కోలుకుంటున్న ఆటోమొబైల్ రంగం, అమ్మకాలు స్వల్పంగా పెరిగే అవకాశం!
ఇండియన్ ఆటోమొబైల్ రంగానికి ఒక శుభవార్త. ఏడాది కాలంగా అంతకంతకూ పడిపోతూ వస్తున్న అమ్మకాలు... ఈ ఏడాదిలో కొంత కుదురుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఒక ప్రముఖ రేటింగ్ సంస్థ తన అంచనాలను వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమ వర్గాలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. చైనా లో మొదలైన కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నా... ఇండియాలో మాత్రం ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంపై అది పెద్దగా పడే అవకాశాలు కనిపించటం లేదు. మార్కెట్ లీడర్ మారుతి సుజుకీ నుంచి టాటా మోటార్స్ వరకు ఏ ఒక్క కంపెనీ కూడా గత ఏడాది కాలంగా అమ్మకాల్లో వృద్ధి నమోదు చేయలేదు.
ఫలితంగా ఈ రంగంలో సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఊడిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీలు అన్నీ కూడా తమ ప్రొడక్షన్ ను తగ్గించేశాయి. అప్పటికే ఉన్న ఇన్వెంటరీ ని క్లియర్ చేసుకునే పనిలో పడ్డాయి. అయితే, దేశంలో బీఎస్ - 6 కాలుష్య నియంత్రణ విధానంలో అమల్లోకి వస్తుండటం, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఆదరణ పెరుగుతుండటంతో ఎంత ప్రయత్నించినా కార్లు, టూ వీలర్లు, వాణిజ్య వాహనాల అమ్మకాలు నేల చూపులు చూశాయి. కానీ ఇన్వెంటరీ తగ్గించుకునేందుకు కార్ల కంపెనీలు ప్రకటిస్తున్న డిస్కౌంట్లు, ప్రభుత్వం తీసుకున్న కొన్ని ఉద్దేపన చర్యలు అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేయనున్నాయి.
హైదరాబాద్ స్థాయిలో..: మైక్రోసాఫ్ట్లో భారత యువతకు మరిన్ని అద్భుత అవకాశాలు
పెరగనున్న అమ్మకాలు..
గతేడాది అంటే 2019 లో ఇండియన్ ఆటోమొబైల్ రంగం మొత్తంగా 11.8% క్షీణించగా... 2020 లో మాత్రం అమ్మకాలు 0.5% పెరుగుతాయని ప్రపంచ ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడించింది. దీనికి ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో పాటు డిస్కౌంట్లు తోడై అమ్మకాలు పెరుగుతాయని సంస్థ పేర్కొంది. ఈ విషయాన్నీ ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనంలో వెల్లడించింది. అయితే, బలహీనమైన వినియోగ డిమాండ్, తక్కువ ద్రవ్య లభ్యత వంటి కారణాలు ఈ రంగాన్ని ప్రభావితం చేస్తాయని మూడీస్ తెలిపింది. కాగా, క్రమంగా ఈ రంగం కోలుకుని 2021 లో కార్ల అమ్మకాలు 2% మేరకు పెరుగుతాయని మూడీస్ తన అంచనాలను వెల్లడించింది.
గ్లోబల్ సేల్స్ ఢమాల్...
ఇండియన్ ఆటోమొబైల్ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మూడీస్... గ్లోబల్ ఆటోమొబైల్ రంగానికి మాత్రం బ్యాడ్ న్యూస్ ను మోసుకువచ్చింది. ఈ ఏడాదిలో ప్రపంచ ఆటోమొబైల్ అమ్మకాలు సుమారు 2.5% మేరకు క్షీణిస్తాయని పేర్కొంది. అంతక్రితం ఏడాదిలో క్షీణించిన 4.5% తో పోల్చితే ఇది తక్కువే అయినప్పటికి... గతంలో తాము అంచనా వేసిన 0.9% తరుగులతో పోల్చితే మాత్రం చాలా ఎక్కువగా ఉందని మూడీస్ వెల్లడించింది. అయితే, వచ్చే ఏడాదిలో మాత్రమే ఈ రంగం కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. అది కూడా కనీసం 1.5% మేరకు అమ్మకాల్లో వృద్ధి నమోదు చేస్తేనే 2021 లో ఆటోమొబైల్ రంగానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడింది.
కరోనా దెబ్బకు చైనా విలవిల...
చైనా లో బయటపడ్డ కరోనా వైరస్ దెబ్బకు ఆ దేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు భారీగా క్షీణించే అవకాశాలు ఉన్నట్లు మూడీస్ స్పష్టం చేసింది. గతేడాది 1% వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసినప్పటికీ... ప్రస్తుతం కరోనా దెబ్బకు చైనా లో ఆటో సేల్స్ 2.9% వరకు తగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ తరుగుదల అటు పాసెంజర్ వెహికల్స్, ఇటు కమర్షియల్ వాహనాల్లో కూడా కనిపిస్తుందని మూడీస్ తెలిపింది. కరోనా ప్రభావంతో చైనా లో ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వాహనాల ఉత్పత్తి తగ్గిపోతోంది. ప్రజలు బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్లు సహా అన్ని రకాల వాహనాల అమ్మకాలు నేల చూపులు చూస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. అయితే, 2021 లో మాత్రం చైనా లో కూడా ఆటో సేల్స్ పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.