విదేశాల్లో లిస్టింగ్ ఇక సులువు... ప్రభుత్వ మదిలో కొత్త ఆలోచన!
త్వరగా, ఎక్కువ మొత్తంలో ఫండింగ్ కావాలంటే తప్పనిసరిగా విదేశాల వైపు చూడాల్సిందే. అది స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడి అయినా, పెద్ద కంపెనీల లిస్టింగ్ అయినా అటువైపు దృష్టి సారించాల్సిందే. లండన్, న్యూయార్క్ వంటి మహానగరాల్లో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయితే కాసుల వర్షం కురవటం సహజమే. ఎందుకంటే, అక్కడ పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు నిధుల పెట్టెలతో సిద్ధంగా ఉంటారు. మనం చేయాల్సిందల్లా... వారికి నచ్చేలా, నలుగురు మెచ్చేలా మన కంపెనీ భవిష్యత్ బిజినెస్ ప్లాన్ ను వివరించటమే.
అది వారికి నచ్చిందంటే చాలు.. 10 మిలియన్ డాలర్లు వస్తాయనుకుంటే 100 మిలియన్ డాలర్లు కుమ్మరించగల సత్తా ఆ మార్కెట్లది. లిస్టింగ్ నిబంధనలు కూడా మనతో పోల్చితే సరళంగా ఉంటాయి. అందుకే, భారత ప్రభుత్వం ప్రస్తుతం ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. మన కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యేలా నిబంధలు రూపొందిస్తోంది. ఇప్పుడున్న కొన్ని నిబంధనలను మార్చటంతో పాటు, కంపెనీలు అక్కడి స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యి నిధులు సమీకరించేందుకు అవి దోహదపడేలా చర్యలు తీసుకుంటోంది. ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ఆధారంగా మీకోసం కొన్ని వివరాలు.
ఐకియాకు షాక్: లక్షల కొద్దీ ఇండియా ఉత్పత్తులు వెనక్కి!
ఎంపిక చేసిన దేశాల్లోనే...
మన దేశ కంపెనీలు విదేశి స్టాక్ ఎక్స్చేంజి ల్లో లిస్ట్ అయ్యేందుకు త్వరలోనే మార్గం సుగమం అవుతుంది కానీ, కొన్ని దేశాలకే అది పరిమితం కానుందని సమాచారం. అమెరికా, యూకే, చైనా, జపాన్, హాంగ్ కాంగ్ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఫైనాన్సియల్ ఆక్షన్ టాస్క్ ఫోర్స్ లో భాగస్వాములుగా ఉన్నాయి. ఇది ఒక ప్రపంచ స్థాయి మనీ లాండరింగ్ వ్యతిరేక బృందం. అలాగే ఈ దేశాలు ఇంటర్నేషనల్ ఆర్గనైజషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్ (ఐఓఎస్ సి ఓ )లో సభ్య దేశాలు కూడా. ఇక్కడైతే, నిధుల ప్రవాహం చట్టపరంగా జరుగుతుంది. మనీ లాండరింగ్ కు అవకాశం ఉదండని ప్రభుత్వ యోచన.
ఫెమా చట్టంలో మార్పులు...
ప్రస్తుతం అత్యంత కఠినతరంగా ఉన్న ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజి మానేజ్మెంట్ ఆక్ట్) చట్టానికి కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. విదేశాల్లో లిస్ట్ ఐన భారత అన్ - లిస్టెడ్ కంపెనీ అక్కడి నుంచి చేసే షేర్ల బదిలీపై కాపిటల్ గెయిన్స్ టాక్స్ విధింపు మినహాయించటం వంటి అంశాలు ఇందులో ఇండబోతున్నాయి. హవాలా రూపంలో పన్ను స్వర్గధామ దేశాలకు మన దేశం నుంచి నిధులు తరలించి, మళ్ళీ మనీ లాండరింగ్ రూట్ లో ఇక్కడి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టె ప్రక్రియను ఫెమా చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీ ఐ ) దీనిని నిశితంగా పరిశీలిస్తుంటుంది. అయితే, మార్పుల తర్వాత కూడా ఫెమా చట్టం ఇప్పటంత పటిష్టంగానే ఉంటూ, మన కంపెనీలు ఎంపిక చేసిన దేశాల స్టాక్ ఎక్స్చేంజి ల నుంచి నిధులను రాబట్టేలా తీర్చిదిద్దనున్నారు.
ఇన్ఫోసిస్
టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్... దశాబ్దాల క్రితమే అమెరికా లో తన ఏడీఆర్ లను లిస్ట్ చేసి నిధులను సమీకరించింది. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ కూడా ఈ మార్గాన్ని అనుసరించింది. ఇటీవల హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు కూడా తన ఏ డీ ఆర్ లు లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా ) మార్గనిర్దేశకాల ప్రకారం... మన దేశ స్టాక్ మార్కెట్ల లో లిస్ట్ ఐన కంపెనీలకు మాత్రమే అమెరికా వంటి మార్కెట్లలో ఏ డీ ఆర్ లేదా గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్ (జీ డీ ఆర్ ) రూపంలో నిధుల సమీకరణ అవకాశం ఉంది. కానీ ఇక ముందు ఇండియన్ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కాకుండానే, ఎంపిక చేసిన విదేశీ స్టాక్ ఎక్స్చేంజి లో నేరుగా పూర్తిస్థాయి లిస్టింగ్ కు అనుమతిస్తారు.
పెట్టుబడుల వరద...
ప్రభుత్వ మదిలో ఉన్న ఈ ఆలోచన కార్యరూపం దాల్చితే... ఇండియన్ స్టార్టుప్ కంపెనీలతో పాటు, అనేక అన్-లిస్టెడ్ కంపెనీలకు మేలు జరుగుతుంది. అవన్నీ కొత్త పెట్టుబడిదారుల నుంచి పెద్ద మొత్తంలో నిధులను సమీకరించుకోవచ్చు. వ్యాపారాలను విస్తరించుకోవచ్చు. ఈ విషయంలో చైనా చాలా ముందు ఉంది. ఇప్పటికే సుమారు 300 చైనా కంపెనీలు విదేశి స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి పెద్ద మొత్తం లో నిధులు రాబట్టాయి. చైనా అపర కుబేరుడు జాక్ మా కు చెందిన అలీబాబా గ్రూప్ ఇందుకు ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పటివరకు సుమారు 15 భారత లిస్టెడ్ కంపెనీలు విదేశాల్లో ఏ డీ ఆర్, జీ డీ ఆర్ లను లిస్ట్ చేశాయి. కానీ, నిబంధనలు మారితే త్వరలోనే పెద్ద సంఖ్యలో మన కంపెనీలు విదేశి ఎక్స్చేంజి లకు క్యూ కడతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, విదేశీ స్టాక్ ఎక్స్చేంజి లు లిస్టింగ్ అప్పుడు ఎంత సులభంగా ఉంటాయో, తేడా వస్తే అంతే కఠినంగా శిక్షిస్తాయి. ఈ విషయంలో మాత్రం మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.