Billionaire Charity: ఎందరో ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రజల అభ్యున్నతి కోసం కోట్లకు కోట్లు విరాళాలు ఇవ్వడం చూస్తున్నాం. అలాగే కెనడాకు చెందిన అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరైన చిప్ విల్సన్ 76 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.600 కోట్లు.

అడవులను కాపాడేందుకు..
కెనడాలోని అటవీ భూమిని కాపాడేందుకు ఆయన ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం గమనార్హం. పర్యావరణ పరిరక్షణకు దీనిని వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన 13వ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. లులులెమోన్ అథ్లెటికా వ్యవస్థాపకుడిగా ఉన్న చిప్ విల్సన్ అటవీ భూములను రక్షించాలని నిర్ణయించుకోవటం గమనార్హం. ఈ విరాళం కెనడియన్ అటవీ భూమి పరిరక్షణ చరిత్రలో ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద విరాళంగా నిలిచింది.

తరువాతి తరం..
అటవీ భూములను రక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని చిప్ విల్సన్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో తెలిపారు. తరువాతి తరాలకు ఇది తాను చేస్తున్న సహాయమని అన్నారు. భూమిని సంరక్షించటంలో సహాయం చేసే అవకాశం తనకు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ తాను కృతజ్ఞుడనన్నారు.

పార్కులుగా మార్చేందుకు..
ఈ విరాళం వల్ల అటవీ భూములు పార్కులుగా మారుతాయని, పార్కుల నిర్వహణకు తమ ఫౌండేషన్ నిధులు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. 5.7 బిలియన్ డాలర్ల సంపదతో కెనడాలో 13వ అత్యంత ధనికుడిగా చిప్ కొనసాగుతున్నారు.

అమెరికన్ బిలియనీర్..
వాతావరణ మార్పులపై పోరాడేందుకు అమెరికన్ బిలియనీర్ వైవోన్ చౌనార్డ్ 3 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత చిప్ విల్సన్ ఈ ప్రకటన చేశారు. చిప్ విల్సన్ కూడా ఒక ఇంటర్వ్యూలో వైవోన్ చౌనార్డ్ విరాళం తనను ఆకట్టుకున్నట్లు 'ది ఎర్త్ ఇప్పుడు మా ఏకైక భాగస్వామి' అని చెప్పారు.

అంతరించిపోతున్న అడవులు..
కెనడాలోని పశ్చిమ తీరం వెంబడి ఉన్న బ్రిటిష్ కొలంబియాలోని అడవులు నాశనమవుతున్నాయని, వాటిని రక్షించేందుకే ఈ విరాళం ఇచ్చినట్లు చిప్ తెలిపారు. బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని అటవీ భూమిని కాపాడుకోవడం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చితే ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications