పరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్కు కెయిర్న్ తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ: కెయిర్న్ ఎనర్జీ విదేశాల్లోని భారత ఆస్తులను గుర్తించే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుకు లోబడి తమకు 140 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని లేదంటే విదేశాల్లోని భారత బ్యాంకు ఖాతాలు, విమానాలు, నౌకలు తదితర ఆస్తులు జఫ్తు చేసుకొని వసూలు చేసుకుంటామని భారత్ను బ్రిటన్ సంస్థ అయిన కెయిర్న్ గట్టిగా హెచ్చరించింది. పరిహారం చెల్లింపులో విఫలమైతే జఫ్తు చేసుకునేందుకు అనువైన భారత విదేశీ ఆస్తులపై ఇప్పటికే ఆరా తీసినట్లు తెలిపింది.
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
ఈ తీర్పును అమలు చేయాలి
లండన్లోని భారత హైకమిషన్కు ఈ నెల 22వ తేదీన ఈ మేరకు కెయిర్న్ సీఈవో లేఖ రాశారు. ఈ లేఖ కాపీలను ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రులకి కూడా పంపించారు. ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు అంతిమమని, విధిగా పాటించాల్సిందేనని, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ నిబంధనలకు లోబడిన దేశం కావడంతో తీర్పుకు లోబడాల్సి ఉంటుందని కెయిర్న్ ఎనర్జీ తన లేఖలో పేర్కొంది. ట్రీటి ఆర్బిట్రేషన్ కేసు తీర్పును అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
వడ్డీతో సహా చెల్లించాలని
పన్ను వివాదంపై సుదీర్ఘంగా జరిగిన వాదనల్లో కెయిర్న్కు వడ్డీ, ఖర్చులు చెల్లించాలని ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు చెప్పింది. న్యూయార్క్ కన్వెన్షన్కు భారత్ సంతకం చేసిందని, ఈ నేపథ్యంలో ఆర్బిట్రేషన్ తీర్పును ప్రపంచవ్యాప్త భారతీయ ఆస్తులపై అమలు చేసే అధికారం ఉందని తెలిపింది. ఇందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపింది.
నెదర్లాండ్స్, ఫ్రాన్స్లో భారత్కు వ్యతిరేకంగా క్లెయిమ్స్ను రిజిస్టర్ చేసింది. త్వరలో కెనడా, అమెరికాలోను చేయనుంది. కోర్టు నుంచి ఉత్తర్వులు పొందడం ద్వారా ఈ దేశాల్లో భారత ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తోంది. రూ.10వేల కోట్లకు పైగా రెట్రోస్పెక్టివ్ పన్ను కేసులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు గత ఏడాది కెయిర్న్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పన్ను బకాయి వసూళ్ల కోసం గతంలో ప్రభుత్వం విక్రయించిన కంపెనీ షేర్లు, జప్తు చేసిన డివిడెండ్స్, నిలిపివేసిన ట్యాక్స్ రీఫండ్స్ను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.
రెండేళ్ల క్రితం కానోకో ఫిలిప్స్
2019లో అమెరికాకు చెందిన ఇంధన సంస్థ కానోకో ఫిలిప్స్... వెనిజులా స్టేట్ ఆయిల్ కంపెనీ పీడీవీఎస్ఏ ఆస్తుల కోసం ఇదే తరహా అడుగులు వేసింది. ఆర్బిట్రేషన్లో వెనిజులాపై 2 బిలియన్ డాలర్ల కంపన్షేషన్ను కేసును గెలిచింది. అప్పుడు వెనిజులా ప్రభుత్వం దిగి వచ్చి సొమ్ము చెల్లించింది.