భారత్కు భారీ షాక్, ప్యారిస్లో ఆస్తులు స్వాధీనం చేసుకున్న కెయిర్న్?
బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో భారత్కు గట్టి షాక్ తగిలింది. అర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బులు చెల్లించనందుకు గాను ఫ్రాన్స్లోని భారత ప్రభుత్వ ఆస్తుల జఫ్తుకు అవసరమైన న్యాయప్రక్రియను బుధవారం పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రెంచ్ కోర్టు అనుమతుల మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రాన్స్లోని 20 భారత ప్రభుత్వ ఆస్తుల స్వాధీనానికి న్యాయ ప్రక్రియ పూర్తిచేసినట్లుగా చెబుతోంది.
న్యాయప్రక్రియ ముగిసింది
ఇండియన్ గవర్నమెంట్ ఆస్తుల యాజమాన్య హక్కులను కెయిర్న్ ఎనర్జీ తీసుకునేందుకు ఫ్రెంచ్ కోర్టు జూన్ 11వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిందని, ఇందుకు సంబంధించి న్యాయ ప్రక్రియ బుధవారంతో ముగిసిందని చెబుతున్నారు. పారిస్లో భారత్కు చెందిన దాదాపు 20 ఆస్తులను కంపెనీ జప్తు చేసుకున్నట్లుగా లేదా చేసుకునే ప్రక్రియను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. వీటి వ్యాల్యూ 20 మిలియన్ యూరోలకు పైగా ఉంటుంది.
వివిధ దేశాల్లోని కోర్టుల్లో పిటిషన్
భారత ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని గత ఏడాది డిసెంబర్ నెలలో ఆర్బిట్రేషన్ కోర్టు కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మొత్తం చెల్లించాలని భారత్ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. ఈ సొమ్మును రాబట్టుకునేందుకు కెయిర్న్ ఎనర్జీ పలు దేశాల్లోని కోర్టులను ఆశ్రయించింది.
ఫ్రాన్స్లో అనుమతి రావడంతో..
అమెరికా, యూకే, నెదర్లాండ్స్, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, జపాన్, యూఏఈ తదితర దేశాల్లోని కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. ఆయా దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని కోరింది. ఇందులో భాగంగా ఫ్రెంచ్ కోర్టు నుండి అనుమతులు రావడంతో అక్కడి భారత ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.