జయహో భారత్ ! అంతర్జాతీయ విపణిలో CAG విజయకేతనం.. మరోసారి భారత అర్థశాస్త్రానికి అగ్రతాంబూలం
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రంగంలోనూ భారతీయుల హవా కొనసాగుతోంది. విశ్వగురువుగా పేరున్న ఇండియా.. కేవలం మాటల వరకే కాకుండా అది నిజమని నిరూపిస్తోంది.దిగ్గజ సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు భారతీయులను అందలం ఎక్కిస్తున్నారు. వారి సారథ్యంలో తమ సంస్థలను ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు అధ్యక్షులుగా ఓ ఇండో అమెరికన్ ను జో బైడెన్ ప్రతిపాదించారు. ఇప్పుడు ప్రపంచం లెక్కలు తేల్చడానికి మరో ఇండియన్ అవసరమయ్యాడు. ఇతర దేశాలను వెనక్కి నెట్టి తన నైపుణ్యంతో ఇండియా ముందుకు దూసుకుపోతోంది .
నాలుగేళ్లపాటు ILO ఆడిటర్ గా..
భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్(CAG) గిరీష్ చంద్ర ముర్ము చరిత్ర సృష్టించారు. జెనీవాలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO)కి ఎక్స్ టర్నల్ ఆడిటర్ గా ఎంపికయ్యారు. 2024 నుంచి 2027 వరకు నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కఠినమైన ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి ఈ ఫీట్ సాధించారు. అంతర్జాతీయ సమాజంలో వృత్తి నైపుణ్యం, అత్యున్నత ప్రమాణాలు, గ్లోబల్ ఆడిట్ అనుభవంతో పాటు బలమైన జాతీయతను పరిగణలోనికి తీసుకుని ఈ పదవికి CAGను ఎంపిక చేశారు.
CAG అప్రోచ్ కు ILO ఫిదా:
సాంకేతిక అనుభవం సహా ఇతర ప్రమాణాల ఆధారంగా టెక్నికల్ ప్రజెంటేషన్ కోసం మూడు అత్యున్నత ఆడిట్ సంస్థలు భారతదేశం, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ లను ILO షార్ట్ లిస్ట్ చేసింది. సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంలో CAG అప్రోచ్ కు సెలక్షన్ ప్యానెల్ ఫిదా అయ్యింది. స్వతంత్రంగా పనిచేస్తూ, తమ సంస్థ లక్ష్యాలను అందుకోవడానికి కాగ్ పర్యవేక్షణ మరింత ఊతం ఇస్తుందని అభిప్రాయపడింది.
సాంకేతిక సామర్థ్యం భేష్:
ILO నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా CAG బృందం ఇంటర్వ్యూకి సిద్ధమైంది. ఆడిట్ ప్రక్రియలో డేటా అనలిటిక్స్, రిస్క్ ప్రొఫైలింగ్, నమూనా సేకరణ విధానాలు.. మనవారిని ప్యానెల్ ప్రత్యేకంగా గుర్తించడానికి సహాయపడ్డాయి. అంతర్జాతీయ సంస్థ పాలన, నిర్వహణను ఆడిటింగ్ తో సమన్వయం చేయగల సాంకేతిక సామర్థ్యం, నిబద్ధత కాగ్ బృందంలో ఉందని ILO నమ్మింది. కొత్త సాంకేతికతను నేర్చుకుంటూ, ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకుంటూ ఉండే 'నాలెడ్జ్ డ్రివెన్' సంస్థగా కాగ్ ను గుర్తించింది.
|
వీటిలోనూ కాగ్ మార్క్ చూపిస్తోంది:
ఇవేగాక ఐక్యరాజ్యసమితి (UN) ఎక్స్ టర్నల్ ఆడిటర్ల ప్యానెల్ లోనూ CAG సభ్యులే. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ సభ్యులుగాను వ్యవహరిస్తోంది. నాలెడ్జ్ షేరింగ్ కమిటీకి, IT ఆడిట్ వర్కింగ్ గ్రూప్, కంప్లయన్స్ ఆడిట్ సబ్ కమిటీకి అధ్యక్షత వహిస్తోంది. ASOSAI పాలక మండలిలోలోనూ కాగ్ కు సభ్యత్వం ఉంది.