72 లక్షల మంది PF ఖాతాదారులకు కేంద్రం గుడ్న్యూస్: ఆగస్ట్ వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు చిక్కిపోయాయి. ఉద్యోగులకు అందరికీ చేతికి వేతనం రావడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు, ఉద్యోగులకు, ప్రజలకు రకాలుగా అండగా ఉంటోంది. వైరస్ కారణంగా సంస్థల యజమానులు, ఉద్యోగుల చేతుల్లో నగదు ఉంచేందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పీఎఫ్ను ప్రభుత్వమే మూడు నెలల చెల్లించింది. తాజాగా కేంద్ర కేబినెట్ దీనిని మరో మూడు నెలలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే కంపెనీలు, ఉద్యోగుల పీఎఫ్ వాటాను ఆగస్ట్ 2020 వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఉద్యోగలకు షాక్: తగ్గిన ఈపీఎఫ్ఓ ఆదాయం, పీఎఫ్ వడ్డీ తగ్గే అవకాశం
మరో మూడు నెలలు పొడిగింపు
యజమాని, కంపెనీల ఉద్యోగులకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కాంట్రిబ్యూషన్ను కేంద్ర కేబినెట్ మరో మూడు నెలలు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (జూలై 8) ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం మొత్తం 24 శాతం వాటాను మరో మూడు నెలల పాటు అంటే ఆగస్ట్ వరకు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తొలుత మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ నెలలకు కూడా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
72 లక్షలమందికి ప్రయోజనం
కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 72 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వీటిని అందిస్తున్నారు. దీనిని భరించేందుకు కేంద్రం ముందుకు రావడం వల్ల రూ.4,860 కోట్ల భారం పడుతోంది. కరోనా సమయంలో కంపెనీలు, ఉద్యోగులకు ఊరట కల్పించడం, వారి చేతుల్లో సాధ్యమైనంత మేర నగదు ఉంచే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పీఎఫ్ మొత్తాన్ని ఇస్తోంది.
ఎవరికి వర్తిస్తుంది?
ఏదైనా కంపెనీలో 100 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉండి, అందులో 90 శాతం మందికి రూ.15,000 కంటే తక్కువ వేతనం ఉంటే ఇది వర్తిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న కంపెనీలు వేతనాలు ఇచ్చేందుకే ఇబ్బందులు పడుతున్నాయి. పీఎఫ్ నిలిచిపోవద్దని కేంద్రం కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఈపీఎఫ్ కోసం యజమాని 12 శాతం, ఉద్యోగి వాటాగా 12 శాతం ప్రతి నెల ఈపీఎఫ్ఓ అకౌంట్కు వెళ్తుంది. మొత్తం 24 శాతం వాటాలో ఉద్యోగి, యజమాని వాటాలో 3.67 శాతం చొప్పున (రెండు) ఈపీఎఫ్ అకౌంట్కు, 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంకు వెళ్తుంది.
గరీబ్ కళ్యాణ్ యోజన
గరీబ్ కళ్యాణ్ యోజనను కూడా పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనిని నవంబర్ వరకు పొడిగించింది. పేద మహిళలకు అందించే ఉచిత ఎల్పీజీ సిలిండర్ను సెప్టెంబర్ వరకు కొనసాగిస్తారు. దీంతో 7.4 కోట్లమందికి లబ్ధి చేకూరుతుంది అలాగే పట్టణ ప్రాంతాల్లో వలస కూలీల కోసం ఉద్దేశించిన అర్బన్ రెంటల్ హౌసింగ్ స్కీంకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో నిర్మాణాలు చేపట్టడంతో పాటు రాష్ట్రాలు ఈ స్కీంలో చేరితో కేంద్రం తగిన సాయం అందిస్తుంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 14న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కేబినెట్ ఆమోదించడంతో ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.