ఐదుగురిలో ఒకరే ప్రయాణం... నెలకు రూ 6,000 కోట్ల నష్టం! కుదేలవుతున్న బస్సు ట్రావెల్ ఇండస్ట్రీ
కరోనా వైరస్ తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. దేశం లో ప్రతి ఒక్కరి జీవన శైలిని ఈ మహమ్మారి పూర్తిగా మార్చివేసింది. ఒకప్పుడు ఇండియా లో బస్సు ట్రావెల్ రంగం మూడు పువ్వులు ... ఆరు కాయలుగా వర్థిల్లుతుండేది. ప్రభుత్వ రంగంలో నడిచే ఆర్టీసీ సేవలకు ధీటుగా... ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తుండేవి. కొన్ని రూట్ల లో ఐతే ప్రైవేట్ బస్సు సేవలు మాత్రమే లభిస్తుండేవి. అంతలా విస్తరించిన భారత్ బస్సు ట్రావెల్ రంగం... కరోనా వైరస్ దెబ్బకు పూర్తిగా కుదేలైపోతోంది. లాక్ డౌన్ లో పూర్తిగా షెడ్ల కు మాత్రమే పరిమితమైన బస్సులు... లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా సర్వీసులు ప్రారంభించాయి. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంట్రా - స్టేట్ (రాష్ట్రం లోపల ) సేవలు అందుబాటులో ఉన్నాయి.
కుప్పకులిన అమెరికా ఆర్థికవ్యవస్థ, 70% వాటా ఉన్న ఆ ఖర్చులు క్లోజ్!
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ - కర్ణాటకల మధ్య అంతర్రాష్ట్ర (ఇంటర్ - స్టేట్) సేవలు కూడా ప్రారంభమయ్యాయి. అటు రాష్ట్రాల ఆర్టీసీ లతో పాటు ఇటు ప్రైవేటు ట్రావెల్ బస్సులు కూడా రోడ్డు ఎక్కాయి. కానీ, ఆశించిన స్థాయిలో ప్రయాణికులు ప్రయాణాలు చేయటం లేదు. కరోనా కు ముందు పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం కేవలం ఐదో వంతు మాత్రమే ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆన్లైన్ టిక్కెటింగ్ కంపెనీ అభిబస్.కామ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఓఓ) రోహిత్ శర్మ చెప్పారు. గుడ్ రిటర్న్స్ తెలుగు కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఈ రంగానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు ఆయన వెల్లడించారు.
నిబంధనలు పాటిస్తున్నా...
కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. ప్రయాణికుల నుంచి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రతి బస్సును ఫుమిగేషన్ చేయటం, శానిటైజ్ చేయటం, సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు ప్రతి రెండు సీట్ల లో ఒకటి ఖాళీగా వదిలేయటం చేస్తున్నారు. తమ ప్లాట్ఫారం పై సేవలు అందించే ట్రావెల్ ఆపరేటర్స్ అందరికీ అభిబస్ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. బస్సులను నిబంధనలకు అనుగుణంగా ఎలా శుభ్రంగా ఉంచాలన్న అంశాలపై ప్రత్యేక వెబినార్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. అంతే కాకుండా వారు తూచ తప్పకుండా వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తొలినాళ్లలో బస్సుల కు ఆదరణ మెరుగ్గా ఉన్నప్పటికీ... రాను రాను కేసులు పెరుగుతుండటంతో అది తగ్గుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
అంతా ఆన్లైన్...
ప్రస్తుతం ప్రైవేటు బస్సు సర్వీసు ల కంటే రాష్ట్రాల కు సంబంధించిన ఆర్టీసీ బస్సుల సర్వీసులు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం అన్ని రకాల బస్సు సేవల్లో కేవలం 50% ఆక్యుపెన్సీ ఉంటోంది. కానీ కోవిడ్ -19 కంటే ముందు పరిస్థితులతో పోల్చితే మాత్రం ప్రస్తుతం అది 20% మాత్రమేనని చెప్పాలి. అంటే మొత్తం బస్సు సామర్థ్యంలో ఐదో వంతు మాత్రమే ప్రయాణికులు ఉంటున్నారు. కానీ, ఇక్కడ ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకు మునుపు ఎక్కువ మంది కౌంటర్లలో టిక్కెట్లు కొనుగోలు చేసే వారు. కానీ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు అందరూ ఆన్లైన్ లోనే వారి టిక్కెట్ల ను బుక్ చేసుకుంటున్నారు. దీంతో అభిబస్ వంటి ఆన్లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునే సేవలు అందించే వెబ్సైట్లకు ట్రాఫిక్ పెరిగిందని చెప్పాలి. ఇదే ట్రెండ్ భవిష్యత్ లో కూడా కొనసాగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.
నెలకు రూ 6,000 కోట్ల నష్టం...
భారత సంఘటిత బస్సు ట్రావెల్ పరిశ్రమ పరిమాణం సుమారు 10 బిలియన్ డాలర్లు (సుమారు 75,000 కోట్లు) ఉంటుందని అంచనా. ఇది ఇప్పటి వరకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. కానీ కోవిడ్-19 తర్వాత దేశంలో బాగా దెబ్బతిన్న రంగాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిమితంగానైనా బస్సు సేవలు నడుస్తున్నా... ఈ రంగానికి నెలకు సుమారు 800 మిలియన్ డాలర్లు (రూ 6,000 కోట్లు) నష్టం వాటిల్లుతోంది. ఈ పరిణామం ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఊహించిన దానికంటే వైరస్ ప్రభావం అధికం అవుతున్న తరుణంలో అభిబస్ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టిసారిస్తోంది. ఈ టిక్కెటింగ్ కు డిమాండ్ పెరగటంతో పాటు సాఫ్ట్ వేర్ ఆజ్ ఏ సర్వీస్ (సాస్) విభాగంలో అధిక ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.