Budget 2022: వేటి ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నేడు (ఫిబ్రవరి 1) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చోటు చేసుకున్నాయి. శాలరైడ్ ఎంతో ఆశగా ఎదురుచూసిన పన్ను మినహాయింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను టారిఫ్ పైన ఊరట లభించలేదు. అయితే ఐటీ రిటర్న్స్ సవరణలకు రెండేళ్ల సమయం ఇచ్చారు. ఆదాయ పన్ను స్లాబ్లో మార్పు లేకపోవడంతో మధ్యతరగతి జీవులపై ప్రభావం ఉంటుంది. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ప్రజల చేతిలో నిధులను పెంచుతుంది. కానీ ఊరట లభించలేదు. నేషనల్ పెన్షన్ స్కీంకు సంబంధించి ఉద్యోగులకు 14 శాతం వరకు మినహాయింపును ఇచ్చారు. ప్రస్తుత బడ్జెట్ అనంతరం పలు ఉత్పత్తుల ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి సామాన్యులపై ప్రభావం చూపుతాయి.
కస్టమ్స్ డ్యూటీ పెంపు
గత బడ్జెట్లో వలె ధరల్లో భారీ మార్పులు ఉండకపోవచ్చు. అయితే కొన్ని ఉత్పత్తులపై ప్రభావం ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీలో కొన్ని మార్పులు చేశారు. FY23లో కొన్ని ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రసాయన దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించారు. గొడుగులపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతం పెంచారు.
వ్యవసాయ పనిముట్లపై మినహాయింపు
దేశంలో తయారు చేయబడిన వ్యవసాయరంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటించారు. స్టీల్ స్క్రాప్కు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పొడిగించారు.
గత రెండు బడ్జెట్లలో అనేక కస్టమ్స్ మినహాయింపులను హేతుబద్దీకరించామని, మరోసారి క్రౌడ్ సోర్సింగ్తో సహా విస్తృతమైన సంప్రదింపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, బట్టలు, వైద్య పరికరాలు, తగినంత దేశీయ సామర్థ్యం ఉన్న మందులు, ఔషధాలపై మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ ధరలు తగ్గింపు
ప్రస్తుత బడ్జెట్ నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, లెధర్ ఉత్పత్తులు, దుస్తులు, ఇమిటేషన్ జ్యువెల్లరీ, ఫామింగ్ గూడ్స్, జెమ్ స్టోన్స్ అండ్ డైమండ్స్ ధరలు తగ్గే అవకాశముంది. అదే సమయంలో గొడుగు దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతం పెంచిన నేపథ్యంలో వీటి ధరలు పెరగవచ్చు. ఎగుమతులను ప్రోత్సహించడానికి హస్తకళలు, వస్త్రాలు, తోలు వస్త్రాలు, లెదర్ పాదరక్షలపై అవసరమైన ఎగుమతిదారులకు మినహాయింపులు ఇస్తున్నట్లు తెలిపారు.