నిర్మల సీతారామన్ బడ్జెట్ పైన స్టార్టప్స్ అంచనాలు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ పైన వివిధ రంగాలు, వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక మంత్రి నుండి భారీ ప్రకటనలు ఆశిస్తున్నాయి వివిధ రంగాలు. స్టార్టప్ రంగం కూడా బడ్జెట్ పైన ఆశలు పెట్టుకుంది.
కరోనా సమయంలో దేశీయ స్టార్టప్స్ ఓ స్థాయిలో నిధులను ఆకట్టుకున్నాయి. గత ఏడాది మొత్తంగా 10.14 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. మన కరెన్సీలో ఇది రూ.75 వేల కోట్లు. అంతముందు ఏడాదితో (14.5 బిలియన్ డాలర్లు) నిధులు పెద్ద మొత్తంలో క్షీణించగా, సంఖ్యాపరంగా మాత్రం 20 శాతం అధికమని కన్సల్టింగ్ సంస్థలు చెబుతున్నాయి.
ఆయుర్వేద రంగంలో ప్రపంచస్థాయి పరిశోధన, ఉత్పత్తి, అభివృద్ధి, ఆవిష్కరణలకు తోడ్పడే బలమైన వ్యవస్థ రూపొందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు ఇది సరైన సమయమని, ఆయుర్వేద మందులు, ఉత్పత్తులపై జీఎస్టీ మాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం మెరుగైన ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు, బలమైన డేటా, రక్షణ వ్యవస్థలు, మరిన్ని పన్ను మినహాయింపులు అందిస్తుందని ఆశిస్తున్నట్లు ఈ రంగంలోని స్టార్టప్స్ భావిస్తున్నాయి.
విద్యుత్ సరఫరా, ప్రాప్యత, సరసమైన హైస్పీడ్ ఇంటర్నెట్, నోట్ బుక్, ల్యాప్టాప్స్, స్మార్ట్ఫోన్స్ వంటి చవకైన కనెక్టివిటీ పరికరాలను దేశంలోని ప్రతి చోటకు వెళ్లేలా ప్రభుత్వం చొరవ తీసుకొని, భరోసా కల్పించాలని, అప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ గ్లోబల్ హబ్గా మారేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఇలా వివిధ రంగాల్లోని స్టార్టప్స్ తమ తమ రంగాలకు కేటాయింపులు ఉండాలని కోరుకుంటున్నారు.