ఎన్నారైలకు ప్రోత్సాహం, వన్ పర్సన్ కంపెనీకి ఓకే: లక్షల కంపెనీలకు లబ్ధి
న్యూఢిల్లీ: ఎన్నారైలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహకాలు అందించారు. దేశంలో సులభతర వ్యాపార నిర్వహణకు ఊతమిచ్చేలా వన్ పర్సన్ కంపెనీ(OPC) ఏర్పాటుకు అనుమతిచ్చారు. దీంతో ఇకపై కంపెనీలను ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ చట్టంలోని నిబంధనల్లో సవరణలను ప్రతిపాదించారు నిర్మల.
వారికి నిర్మల వరం, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అవసరంలేదు: ఎన్నారైలకు గుడ్న్యూస్
ప్రవాస భారతీయులు కూడా
OPC స్కీం కింద పెయిడప్ క్యాపిటల్, టర్నోవర్ పైన పరిమితి లేకుండా కంపెనీల వృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏ సమయంలోనైనా ఇతర రకాల కంపెనీగా మారేందుకు అనుమతిస్తుంది. ఒక భారతీయ పౌరుడికి రెసిడెన్సీ పరిమితిని తగ్గిస్తుంది. OPC కింద 182 రోజుల 120 రోజులకు తగ్గుతుంది. ప్రవాస భారతీయులు (ఎన్నారై) కూడా OPC చేరవచ్చు.
స్టార్టప్స్కు ప్రోత్సాహం
కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం స్టార్టప్స్కు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్టార్టప్స్తో పాటు ఇన్నోవేటర్స్కు కూడా ఇది ప్రయోజనకరం. అలాగే భారత మార్కెట్లోకి ప్రవేశించే వ్యవస్థాపక సామర్థ్యం ఉన్న ఎన్నారైలకు ఉపయోగపడుతుంది. ఇది స్టార్టప్స్కు ఎంతో ప్రయోజనకరమని పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతూ నిర్మలాసీతారామన్ వ్యాఖ్యానించారు.
కంపెనీలకు లబ్ధి
భారత్లో OPC 2005 నుండి ఉంది. అయితే ఇక్కడ సభ్యుడు, నామినీ భారత నివాసిగా ఒక క్యాలెండర్ ఏడాదిలో 182 రోజులు ఉండాలి. దీనిని ఇప్పుడు 120 రోజులకు తగ్గించారు. దీంతో ప్రవాసులు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడం మరింత సులువుగా మారుతుంది. అలాగే, పెయిడప్ షేర్ క్యాపిటల్ పరిమితిని రూ.50 లక్షలకు, టర్నోవర్ను రూ.2 కోట్లకు తగ్గించారు. ఇప్పటి వరకు ఈ పరిమితి రూ.2 కోట్లుగా, టర్నోవర్ రూ.20 కోట్లుగా ఉంది. దీని ద్వారా 2 లక్షల కంపెనీలకు లబ్ధి చేకూరనుంది.
ఎన్నారైలకు డబుల్ ట్యాక్స్ ఊరట
రిటైర్మెంట్ ఖాతాలపై ఎన్నారైలు ఎదుర్కొంటున్న డబుల్ ట్యాక్స్ వివాదాల విషయంలో ఈ బడ్జెట్ సందర్భంగా నిర్మలమ్మ ఊరట కల్పించారు. స్వదేశానికి ఎన్నారైలు తిరిగి వచ్చినప్పుడు వారి విదేశీ రిటైర్మెంట్ ఖాతాల్లోని ఆదాయానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ద్వంద్వ పన్ను కష్టాలకు సంబంధించిన నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందన్నారు.