రూ.2.5 లక్షల మొత్తంపై వడ్డీకే పన్ను మినహాయింపు, ఇదీ లెక్క..
న్యూఢిల్లీ: అధిక వేతనం పొందే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్(PF) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి బడ్జెట్లో కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పీఎఫ్ కొత్త నిబంధన ప్రకారం రూ.2,50,000 వరకు జమ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకే పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మొత్తం దాటితే జమ చేసే మొత్తానికి లభించే వడ్డీకి వర్తించే స్లాబ్స్ ప్రకారం పన్నును విధిస్తారు. ఈ కొత్త ప్రతిపాదన ఏప్రిల్ 1, 2021 నుండి జమ చేసే వాటికి వర్తిస్తుంది.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
పీఎఫ్.. వడ్డీ, పన్ను రాయితీ
అధిక వేతనాలు తీసుకునే ఉన్నత ఉద్యోగుల ఆదాయాలపై పన్ను మినహాయింపును హేతుబద్దీకరణ చేస్తున్నట్లు బడ్జెట్లో భాగంగా కేంద్రం తెలిపింది. EPF చట్టం ప్రకారం నిర్బంధ చందా కింద వేతనంలో (మూలవేతనం, డీఏ)లో 12 శాతం ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్లో జమ చేయాలి. కంపెనీగా కూడా అంతేమొత్తం (12 శాతం) తన వాటాగా జమ చేస్తుంది. ఈ పరిమితికి మించి భవిష్యత్తు అవసరాల కోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉద్యోగి మూల వేతనానికి మించకుండా జమ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికి కూడా వడ్డీ, పన్నురాయితీ ఉంటుంది.
అందుకే
ఇతర కొన్ని సురక్షిత పెట్టుబడుల కంటే ఇక్కడ వడ్డీ రావడం, పన్ను రాయితీ ఉండటంతో చాలామంది వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్కు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ వేతనం వచ్చే చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిక వేతనం పొందే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్(PF) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి బడ్జెట్లో కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. రూ.2.5 లక్షల మొత్తంపై వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మొత్తం దాటితే పన్ను బాదుడు ఉండనుంది.
ఇదీ లెక్క
ఉద్యోగులు ఎవరైనా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్తో కలిపి పీఎఫ్లో రూ.3 లక్షలు జమ చేస్తుంటే కనుక ఇప్పటి వరకు ఎలాంటి పన్ను లేదు. తాజా బడ్జెట్ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుండి రూ.2.5 లక్షలు మినహాయించి, మిగతా మొత్తానికి అంటే రూ.50వేల మీద వచ్చే వడ్డీ మీద పన్ను చెల్లించాలి.