బీమా రంగంలో FDIలు 49 శాతం నుండి 74 శాతానికి పెంపు
న్యూఢిల్లీ: ఇన్సురెన్స్ రంగంలో FDIలు 49 శాతం నుండి 74 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా 1938 బీమా చట్టాన్ని సవరిస్తున్నట్లు తెలిపారు. డిపాజిట్ల పైన బీమాను పెంచుతున్నట్లు తెలిపారు.
ఇన్సూరెన్స్ యాక్ట్ 1938కు సవరణ చేయాల్సిందిగా ప్రతిపాదిస్తున్నానని, తద్వారా బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు మార్గం సుగమమవుతుందని, నిబంధనలను అనుసరించి విదేశీ యాజమాన్య పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు లభిస్తాయని నిర్మలమ్మ బడ్జెట్ ప్రకటన సమయంలో తెలిపారు.
అలాగే, ప్రభుత్వరంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు బడ్జెట్లో పచ్చజెండా ఊపారు. పవన్ హన్స్, ఎయిరిండియా ప్రయివేటీకరణకు అనుమతిచ్చింది. IDBI, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. LIC పబ్లిక్ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.