Budget 2021: కరోనా, చైనా... 'ఆత్మనిర్భర్ భారత్'కు రెండు కీలక సవాళ్లు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో స్వతంత్ర భారతంలోనే నిర్మలమ్మ అతి పెద్ద సవాల్తో కూడిన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగుమతులు తగ్గించి, దేశీయంగా తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆత్మనిర్భర్ భారత్కు పిలుపునిచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ కోణంలో బడ్జెట్ ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ముందు రెండు కీలక సవాళ్లు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మోడీ ప్రభుత్వం ముందు 2 సవాళ్లు
కరోనా కారణంగా ప్రభుత్వం నుండి సామాన్యుడి వరకు ప్రణాళికలో లేని వ్యయం పెరిగింది. అదే సమయంలో ఆదాయం తగ్గింది. రికవరీ వేగంగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థ క్షీణత ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధి కూడా త్వరగా పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ ఒత్తిళ్లు కూడా భారీగానే ఉంటాయని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడం భారత ప్రభుత్వ ప్రధాన అజెండాలో ఉంటుందని అంటున్నారు. మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ముందు కరోనా వైరస్, చైనా రూపంలో రెండు సవాళ్ళు ఉన్నాయని అంటున్నారు.
రక్షణ వ్యయానికి ప్రాధాన్యత
చైనాతో ధీటుగా నిలబడటానికి రక్షణ వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని చెబుతున్నారు. ఆర్థిక సంకోచంతో పాటు చైనా ఫ్యాక్టర్ అతి కీలకమని అంటున్నారు. ఆదాయం పరంగా చూడలంటే పెట్టుబడుల ఉపసంహరణ కీలకంగా భావిస్తున్నారు. 2021-22 బడ్జెట్లో కరోనా, చైనా సవాళ్లను ఎదుర్కొనే ఆత్మనిర్భర్ భారత్ ఉంటుందని భావిస్తున్నారు.
బడ్జెట్లో ఎక్కువ భాగం ఖర్చులు
ప్రభుత్వ బడ్జెట్లో ఎక్కువ భాగం పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, వేతనాలు, ప్రణాళికాబద్దమైన రాయితీలు తదితరాలు ఉన్నాయి. అయితే ఈసారి గత బడ్జెట్ల కంటే భిన్నంగా కరోనా, చైనాలకు ధీటుగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరింతగా అడుగులు వేసే బడ్జెట్ అవసరం.