Budget 2020: ‘ఆధార్’ ఉంటే చాలు ప్యాన్ కార్డ్ వచ్చేస్తుంది, పత్రాలు అవసరం లేదు..
న్యూఢిల్లీ: పర్మినెంట్ అకౌంట్ నెంబర్(ప్యాన్) పొందడం ఇకపై చాలా సులభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం పార్లమెంటులో బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్యాన్ కార్డు జారీ కోసం కొత్త విధానాన్నితీసుకొచ్చినట్లు తెలిపారు.
ఇక నుంచి ప్యాన్ కార్డ్ ఆన్లైన్ ద్వారా పొందవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్యాన్ కార్డు పొందవచ్చని తెలిపారు. ఇందుకు ఎలాంటి డాక్యుమెంట్లు కూడా అవసరం లేదని, అప్లికేషన్ ఫాం కూడా అవసరం లేదని పేర్కొన్నారు. ఆధార్ కార్డ్ సహాయంతో ఆన్లైన్ ద్వార ప్యాన్ కార్డ్ పొందవచ్చని తెలిపారు.
ఆధార్ కార్డుపై నమోదైన రిజిస్టర్డ్ యాక్టివ్ ఫోన్ నెంబర్కు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) ద్వారా ప్యాన్ కేటాయించబడుతుందని వెల్లడించారు. ఆధార్ కార్డులో నమోదైన పేరు, తేదీ, పుట్టిన రోజు, జెండర్, మొబైల్ నెంబర్, చిరునామాలే జారీ చేయబడే ప్యాన్ కార్డుపై ఉంటాయి.
భారతదేశంలో నివాసం ఉండే వారికే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆధార్ జారీ చేస్తుంది. ఇక ఐటీ డిపార్ట్మెంట్ ప్యాన్ కార్డుపై ఉండే 10 అల్ఫాన్యూమరిక్ నెంబర్ను కేటాయిస్తుంది. వ్యక్తికి గానీ, సంస్థకు గానీ ప్యాన్ తీసుకోవచ్చు.