Budget 2020: మాంద్యానికి మందు.. ఎకానమీ వృద్ధికి జై కొట్టిన నిర్మల సీతారామన్
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమనం తీవ్రతరమవుతున్న వేల ... ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీడీపీ వృద్ధి పైనే దృష్టి సారించింది. తన బడ్జెట్ స్పీచ్ లో దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి అగ్రతాంబూలం వేశారు. ఈ రంగంపై మొత్తంగా రూ 1,03,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా ... మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం వ్యయం పెరిగినప్పుడే ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు కూడా పరుగందుకుంటుంది. నయా ఆర్థిక విధానాల్లో దీనికే అధిక ప్రాధ్యానముంది. ప్రపంచంలోని ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు ఆచరించే విధానం కూడా ఇదే.
ఒకవైపు ఇండియాలో ఆర్థిక మందగమనం ఉందని అంగీకరించేందుకు సిద్ధంగా లేని నిర్మల సీతారామన్... తన చర్యల్లో మాత్రం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టె చర్యలకు పెద్ద పీట వేసింది. మన దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సారి బడ్జెట్లో ఏదో మహాద్భుతం జరగబోతోందని భావించిన చాలా మందిని నిరాశ పరిచిన ఆర్థిక మంత్రి... లోలోపల అయినా సరే దేశం మాంద్యం దిశగా అడుగులు వేస్తోందని గుర్తించారు. ఇప్పుడు గానీ దానికి సరైన చికిత్స చేయకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది ఊహించారు. అందుకే మౌలిక రంగానికి అగ్ర తాంబూలం ఇచ్చారు.
Budget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదా
10% వృద్ధి రేటు...
నిజానికి భారత దేశం ప్రస్తుతం 11 ఏళ్ళ కనిష్ట స్థాయి జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఎవరూ ఊహించనంత వేగంగా వృద్ధి రేటు మందగిస్తూ ఏకంగా 4.5% నికి పడిపోయింది. వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేశంలో అన్ని రకాల ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ తగ్గిపోతోంది. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అమ్మకాలు క్షీణిస్తున్నాయి. ఈ పరిణామం ఎటు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాత్రం... ఈ విషయంలో చాలా గంభీరంగా వ్యవహరించారు. 202-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 10% ఉంటుందని వెల్లడించారు. దీంతో ఆశ్చర్యపోవటం అందరి వంతు ఐంది. 2014-2019 మధ్య కాలంలో సగటున భారత జీడీపీ వృద్ధి రేటు 7.4% ఉందని ఆమె గుర్తు చేశారు. ఒక వైపు ప్రతిపక్షాల ఎంపీలు అరుస్తున్నా... నిర్మల సీతారామన్ అవును 10% వృద్ధి ఉంటుందని మరోసారి కుండబద్దలు కొట్టారు.
రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు..
దేశంలో మెరుగైన మౌలిక వసతులను కల్పించే ఏర్పాటులో భాగంగా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు అన్నిటి పై భారీగా నిధులు కుమ్మరించనుంది. హైవేల నిర్మాణం, రైల్వే నెట్వర్క్ విస్తరణ, పోర్టులను ఆధునికీకరణతో పాటు అనుసంధానత పెంచటం, 100 కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం ఇలా భారీ స్థాయి ప్రణాళికలను వెల్లడించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల వేగవంతమైన సరఫరా కోసం అటు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో పాటు, ఏకంగా కిసాన్ ఉడాన్ పేరుతొ ఒక వైమానిక విధానానికి కూడా అంకురార్పణ చేశారు. ఇవన్నీ అనుకున్న స్థాయిలో క్షేత్ర స్థాయిలో అమలు జరిగితే దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగవటంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయనటంలో సందేహం లేదు.
మూలధన వ్యయం పెంపు...
ఈ సారి బడ్జెట్ లో నిర్మల సీతారామన్ మూల ధన వ్యయ పరిమితిని భారీగా పెంచారు. గతేడాదితో పోల్చితే... 2020-21 కి గాను 21% వృద్ధి తో ఏకంగా రూ 4,00,000 కోట్లకు పైగా మూలధన వ్యయ పరిమితిని కేటాయించారు. ఇవన్నీ వెరసి దేశంలో దీర్ఘకాలిక మౌలిక రంగ ఆస్తులను సృష్టించేలా దోహదపడతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తం కేటాయింపుల్లో ఒక్క రవాణా, మౌలికసదుపాయాల కోసమే రూ 1.70 లక్షల కోట్లు కేటాయించటం విశేషం. మౌలిక రంగానికి కేవలం ప్రభుత్వ నిధులు మాత్రమే సరిపోవు. ప్రైవేటు రంగం కూడా భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం, ప్రైవేటు రంగానికి మద్దతునిచేలా బ్యాంకులకు ఏకంగా రూ 3.50 లక్షల కోట్ల మూలధన నిధులను కేటాయించి ఔరా అనిపించారు. ఇవన్నీ అమల్లోకి వస్తే ప్రభుత్వం ఆశించినట్లు 10% వృద్ధి రేటు కాకపోయినా... 7-8% వృద్ధి కచ్చితంగా సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.